నారాయణపేట, జూన్ 5: నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమిని పంచభూతాలుగా భావిస్తూవస్తున్నామని, ఆధునిక ప్రపంచంలో కరెంట్ కూడా ఆరో భూతంగా భావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం ఎస్ఈ ప్రభాకర్ అధ్యక్షతన విద్యుత్రంగ విజయోత్సవ సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష, జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ దేశమైనా అభివృద్ధితో నడవాలంటే విద్యుత్ అనేది చాలా ముఖ్యమన్నారు. అందుకే విద్యుత్ ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు.
తెలంగాణ సాధనకంటే ముందు కరెంట్ కష్టాలు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి కరెంట్ సరఫరాకు ఎలాంటి అటంకాలు లేకుండా చేశారన్నారు. రైతులకు ఉదయం, రాత్రి మూడు గంటల చొప్పున ఇచ్చే వారని, నేడు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదన్నారు. ఉపాధి కల్పన అనేది విద్యుత్తో సాధ్యమన్నారు. మన ఆర్థిక పరిస్థితి విద్యుత్పై ఆధారపడి ఉందన్నారు. 2014 తర్వాత తెలంగాణలో విద్యుత్ శాఖ చాలా ప్రగతి సాధించిందన్నారు. విద్యుత్ డిమాండ్కు తగ్గకుండా సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణలను చేపట్టిందన్నారు.
గృహ, వాణిజ్య పరిశ్రమలతో సహా అన్నిరంగాల వారికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయబడుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం దిశగా అడుగులు వేసిందన్నారు. నారాయణపేట జిల్లాకే కాకుండా యావత్తు తెలంగాణకు దేశవ్యాప్తంగా విద్యుత్ శాఖ పేరు తీసుకొచ్చిందని, అందుకు కృషి చేసిన ప్రతి విద్యుత్ ఉద్యోగి, కార్మికుడికి తెలంగాణ పౌరుడిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఐలాండ్ సిస్టమ్తో హైదరాబాద్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ సాధించుకోవడానికి ముందు జిల్లా కేంద్రంలో 28 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే నేడు 120కి చేరుకున్నాయన్నారు.
కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ.. దేశంలోనే రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ అంతంతమాత్రమే ఉండేదని, స్వరాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. రైతులకే కాకుండా పారిశ్రామిక సంస్థలకు కూడా 24గంటలపాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. ట్రాన్స్ఫార్మర్లు పాడైతే వెంటనే వాటి స్థానంలో మరో ట్రాన్స్ఫార్మర్
జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సబ్సిడీలతో కూడిన ఉచిత విద్యుత్ను అందిస్తున్నట్లు తెలిపారు. 2014లో 24ఉన్న రైస్ మిల్లులు నేడు 64కు చేరడం చాలా అభినందనీయమన్నారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం అందరినీ అలరింపజేసింది. అదేవిధంగా 2014నుంచి 2023 వరకు విద్యుత్శాఖ సాధించిన ప్రగతిని ఎల్సీడీ స్క్రీన్లతో వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు భీమయ్యగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ లక్ష్మీకాంత్, వార్డు కౌన్సిలర్ శిరీష, విద్యుత్ శాఖ ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు.