నాగర్కర్నూల్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : రైతు వేదికలు ఇక వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలుగా మారనున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన ఈ వేదికల్లో ఇకపై వీసీలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ ప్రక్రియను చేపట్టనున్నది. ఒక్కో కేంద్రం రూ.3.7 లక్షలతో నెలాఖరులోగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వ్యవసాయ అధికారులు, రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నది.
రైతు వేదికల్లో వీసీలు
రైతు వేదికలు బహుముఖ ప్రయోజనకారిగా సేవలు అందించనున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం 2017సంవత్సరంలో రైతులకు సేవలు అందించేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా 2020లో దాదాపుగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. 5వేల హెక్టార్లకు ఒక రైతు వేదిక చొప్పున నిర్మించారు. క్లస్టర్ల వారీగా ఒక్కో క్లస్టర్కు 10 గుంటల నుంచి అర ఎకరం స్థలంలో రైతువేదికల నిర్మాణం జరిగింది. ఈ రైతు వేదికల నిర్మాణాలను ఉపాధి హామీ పథకం నుంచి రూ.8 లక్షలు కేటాయించగా, వ్యవసాయ శాఖ నుంచి రూ.12లక్షల చొప్పున రూ.20 లక్షలతో ఒక హాల్, రెండు గదులతో 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిరోజూ రైతులకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఏఈవోల ద్వారా రైతు వేదికల్లో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. వ్యవసాయ సీజన్ల వారీ గా పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమాలాంటి పలు పథకాల్లో అవసరమైన సహకారం అందించడంలో అలాగే గిట్టుబాటు ధరలు పొందేలా తగిన సలహాలు ఇవ్వడంలో రైతు వేదికలు కీలకంగా మారాయి.
అదే విధంగా రైతు సమావేశ మందిరాలుగా, గోదాంలుగా, విత్తన, ఎరువు, ధాన్యం నిల్వ కేంద్రాలుగా వినియోగించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అలాంటి రైతు వేదికల్లో ఇకపై వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం చర్యలు తీసుకుంటోంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ రైతు వేదికలను వీసీల కోసం ఎంపిక చేసింది. నియోజకవర్గ రైతులందరికీ అందుబాటులో ఉండే వేదికలను దీనికోసం ఎంపిక చేయడం గమనార్హం. రైతులందరికీ అనువుగా ఉండేలా, ఇంటర్నెట్, సరిపడా స్థలం ఉండే వేదికలనే వీసీల కోసం అధికారులు ఇప్పటికే ప్రతిపాదించారు. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా అధిక దిగుబడులు సాధించేలా రైతులకు సాంకేతికత అందుబాటులోకి తీసుకురావడమే రైతువేదికల్లో వీసీల సౌకర్యం కల్పన ఉద్దేశం. ఇప్పటికే ఎంపిక చేసిన కేంద్రాల్లో రూ.3.7లక్షలతో వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి వీలవుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల్లో వీసీలకు వ్యవసాయ శాఖ అధికారులు హాజరవుతూ వస్తున్నారు. ఇకపై రైతు వేదికల్లోనే అధికారులకు వీసీలు అందుబాటులోకి వస్తాయి. అలాగే రైతులకు కూడా వీసీలతో పాటుగా కాలానుగుణంగా వ్యవసాయంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు వీడియోలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారు లు నేరుగా రైతులతో మాట్లాడటంతోపాటు సలహాలు ఇవ్వడం, తీసుకోవడానికి ఈ కేంద్రాలు సౌకర్యంగా ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రావడంపై వ్యవసాయ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు రైతు వేదికలను అధికారులు ఎంపిక చేశారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలంలో సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి, నాగర్కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలం లోని పాలెం, కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల, కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలంలోని రాచూరు గ్రామాల్లోని రైతు వేదికల్లో వీసీ నెలాఖరు వరకు అందుబాటులోకి రానున్నది.