బిజినేపల్లి, ఫిబ్రవరి 27: నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం అడ్డగట్టుపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రకృతి రమణీయంగా విరాజిల్లుతున్నది. ఆలయం నిర్మించి 35ఏండ్లు కావస్తున్న సందర్భంగా తృతీయ పుష్కరోత్సవానికి ఏర్పాట్లు చేపట్టారు. నేటినుంచి మార్చి 8వ తేదీ వరకు తృతీయ పుష్కరోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. ఆలయ చరిత్ర ఇలా.. 1978-1981మధ్య కాలంలో గుడ్లనర్వకు చెందిన నర్సింహారావు వట్టెం శివారులోని అడ్డగట్టుపై కుసుమ, హరినాథ్ ఆశ్రమం నిర్మించుకొని కొండపై వెంకన్న ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు.
ఫురాతన విగ్రహాన్ని ఆసరాగా చేసుకొని ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని సంకల్పించుకున్నారు. వట్టెం గ్రామస్తులైన సందడి రంగారెడ్డి 1983లో సివిల్ ఇంజినీర్గా పనిచేసి అనంతరం వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలనే కోరిక ఉండేది. కాగా, 1983లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. 1985 నుంచి రంగారెడ్డి శేష జీవితమంతా భగవంతుడి సేవకోసం అంకితం చేశారు. 1986, మేలో వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ పేదల తిరుపతిగా పేరుగాంచింది.
1988లో ఆలయ ప్రాంగణంలో కల్యాణమండపాన్ని నిర్మించారు. 1994లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ్భాస్కర్రెడ్డి ధ్యానమందిరానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. 1999లో నాగర్కర్నూల్కు చెందిన సుబ్బారెడ్డి, వాస ఈశ్వరయ్య, హకీం మురళి సహకారంతో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఆంజనేయుడు, గరుడపక్షి విగ్రహాలు, వసతిగృహాలు, రోడ్లు, రేకులషెడ్ను నిర్మించారు.
2021లో రామానుజాచార్యుల విగ్రహాన్ని అనంత నర్సింహారెడ్డి, సుకన్య ఆర్థికసాయంతో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నిధులతో గోశాల, శ్రీకృష్ణ, గోమాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే అద్దాలమేడ, ధ్యాన మందిరం, ముఖద్వారం నిర్మించారు. 1999లో 12ఏండ్లకు ఒకసారి పుష్కరోత్సవం నిర్వహించారు. 2011లో ద్వితీయ పుష్కరోత్సవాన్ని నిర్వహించారు. ఏటా సంక్రాంతికి గోదా వెంకన్న కల్యానోత్సవం, శ్రీరామనవమికి రాములోరి కల్యాణం, వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
పుష్కరోత్సవ కార్యక్రమాలు
మొదటిరోజు మంగళవారం అలంకారం, అర్చన, సేవాకాలం, నివేదన, హోమం, అంకురార్పణ, మార్చి 1న అర్చన, సేవాకాలం, నివేదన, ప్రసాదగోష్టి, అగ్ని ప్రతిష్ఠ, 2న నివేదన, శాంతిపాఠం, చిన జీయర్స్వామికి ఫూర్ణకుంభంతో స్వాగతం పలుకనున్నారు. అదేవిధంగా 10వ తేదీ వరకు నిత్యపూజలు, హోమాలు, ఆరాధన, వాహనసేవలు, వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, రాజభోగం, గరుడోత్సవం నిర్వహించనున్నారు. మహాపూర్ణాహుతి, చక్రతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి.