వనపర్తి, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది. సర్కారు దవాఖానల్లో కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకం అందుబాటులోకి రావడంతో జిల్లా దవాఖానతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సహజ కాన్పులకు ప్రాధ్యానత పెరిగింది. అదేవిధంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ టీబీ నిరూలనలో దేశ, రాష్ట్ర స్థాయిలో మొదటిస్థానంలో కాగా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడంలో రాష్ట్రంలో రెండోస్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది.
టీబీ నిర్మూలనలో జిల్లా పాత్ర
టీబీ నిర్మూలన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉచిత సేవలను అందిస్తున్నారు. జిల్లాలో టీబీ వ్యాధిని తగ్గించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 1,438 ప్రత్యేక క్యాంపుల ద్వారా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించి, అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా తేలిన వ్యక్తికి సంబంధించి రెండు రకాలుగా.. మొదటగా కుటుంబసభ్యులకు, రెండోది రోగికి సన్నిహితంగా ఉన్న వారికి సైతం పరీక్షలు నిర్వహించి వారికి రాకుండా టీపీటీ/ఐసోనైజేషన్ మందులను అందించారు. జిల్లా వ్యాప్తంగా 927మందికి న్యూట్రిషన్ కిట్లు పంపిణి చేయగా, ఇందులో వనపర్తి నియోజకవర్గం పాన్గల్ మండలంలోని 347మందికి మంత్రి నిరంజన్రెడ్డి పౌష్టికాహారం అందించే దిశగా న్యూట్రిషన్ కిట్టను పంపిణీ చేశారు. మిగిలిన వారికి స్నేహ ఫౌండేషన్, పాండుశెట్టి, వర్కటం జగన్నాథ్రెడ్డి, డాక్టర్స్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో ఉచితంగా కిట్లు పంపిణీ చేసినట్లు ప్రోగ్రాం అధికారి సాయినాథ్రెడ్డి తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం టీబీ రోగులకు నెలకు రూ.500 చొప్పున అందజేస్తున్నది.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలు..
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడంలో వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యానర్స్ వంటి రోగులకు ప్రతి నెలా ప్రైవేట్లో పరీక్షలు చేయించుకుంటే నెలకు దాదాపు రూ.2వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని జిల్లా వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా వారి ఇండ్ల వద్దకు వెళ్లి వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మం దులు పంపిణీ చేస్తున్నారు. వీటితోపాటు వ్యాధిగ్రస్తులు తమ మానసిక దైర్యం కోల్పోకుండా మానసిక వైద్య నిపుణులతో వైద్యం చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రక్తపోటు వ్యాధిగ్రస్తులు 39,772 మంది, మధుమేహ వ్యాధిగ్రస్తులు 21,444 , క్యానర్స్ వ్యాధిగ్రస్తులు 202మందిని గుర్తించి వీరికి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలన దిశగా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 1,438 ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించాం. వారికి సకాలంలో మందులు అందజేయడం, పలు సంస్థల దాతలు, మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లావ్యాప్తంగా 927మందికి న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశాం. అదేవిధంగా వారికి నెలకు రూ.500 ప్రభుత్వం అందజేస్తోంది. టీబీ నిర్మూలనలో దేశం, రాష్ట్రంలో వనపర్తి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. పరీక్షలు ఎక్కువగా చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి సన్నిహితంగా ఉన్న వారికి కూడా టెస్ట్లు చేయడం వల్లే టీబీ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నాం.