వనపర్తి టౌన్, ఫిబ్రవరి 22 : మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వనపర్తి ఎస్పీ కె.రక్షితామూర్తి తెలిపారు. బుధవారం ఆమె ఎస్పీ కార్యాలయంలో ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. నాన్న కృష్ణమూర్తి, అమ్మ ఉష స్ఫూర్తితో ఐపీఎస్ కొలువు సాధించానని చెప్పారు. కర్ణాటకలో ప్రాథమికోన్నత విద్యాభ్యాసం, బెంగళూర్లో ఇంజినీరింగ్ పూర్తిచేశానన్నారు. మొదటి పోస్టింగ్ కింద 2018లో గోదావరిఖనిలో ఏడాదిపాటు ఉద్యోగం చేశానన్నారు. ఆ తరువాత పది నెలలపాటు మంచిర్యాల డీసీపీగా పని చేశానన్నారు. అనంతరం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరిలో మూడేండ్ల మూడు నెలలు పనిచేసి.. ఇటీవల వనపర్తి ఎస్పీగా చేరానన్నారు. ఇక్కడి పరిస్థితులను క్రమంగా అర్థం చేసుకొని ముందుకెళ్తానన్నారు. వనపర్తి జిల్లాలో క్రైం రేట్ తక్కువగా నమోదైందన్నారు.
నమస్తే తెలంగాణ : గంజాయి, మాదక ద్రవ్యాలపై చర్యలేంటి..?
ఎస్పీ : పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవిస్తే కౌన్సెలింగ్ ఇస్తాం. అయినా మారకుండా మళ్లీ మళ్లీ మాదక ద్రవ్యాలు సేవిస్తే పీడీ యాక్ట్ నమోదు చేసేందుకైనా వెనుకాడం. జిల్లాకు హైదరాబాద్, కర్నూల్ దగ్గరగా ఉన్నందున మత్తు పదార్థాల రవాణా సులభంగా ఉన్నది. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తాం.
నమస్తే తెలంగాణ : అక్రమ ఇసుక రవాణాపై చర్యలేంటి..?
ఎస్పీ : కలెక్టర్, మైనింగ్, ఇతర శాఖల అధికారులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. సంయుక్త కార్యాచరణతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలుచేస్తాం.
నమస్తే తెలంగాణ : దొంగతనాల నివారణకు చర్యలేంటి..?
ఎస్పీ : జిల్లాలో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. దొంగతనాల నివారణకు అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పిస్తాం. కొత్త కాలనీల్లో కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడతాం. పెట్రోలింగ్ పెంచుతాం. ఇంటి యజమానులు ఊర్లకు వెళ్లినప్పుడు నగదు, బంగారం ఆభరణాలను బ్యాంకు లాకర్లో పెట్టేలా చూసుకోవాలి. ఇంటికి సెంటర్ లాకింగ్ను ఏర్పాటు చేసుకోవాలి. పోలీస్స్టేషన్లో ముందస్తు సమాచారం ఇస్తే పెట్రోలింగ్, గస్తీ ఏర్పాటు చేస్తాం. వైర్లెస్ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నాం. కోతులు, దొంగలు వైర్లను కట్ చేయకుండా ఇవి తోడ్పడుతాయి.