ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతున్నది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం మార్చితో ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 21 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఆయా ఉపాధ్యాయ సంఘాలు ప్రచారం ముమ్మరం చేశాయి. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, మెడికల్, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను నేరుగా ఇండ్లవద్దకు వెళ్లి కలుస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 8వేల మందికిపైగా ఓటర్లు ఉండగా.., 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ఉపాధ్యాయులు, అభ్యర్థుల్లో ఎన్నికల వే‘ఢీ’ మొదలైంది.
– నాగర్కర్నూల్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, మార్చి 6(నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపునకు 21మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయా అభ్యర్థుల తరఫున ఉపాధ్యాయ సంఘాలు ప్రచారం ముమ్మరం చేశాయి. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, మెడికల్, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఓటర్లను ఇండ్లల్లోనూ కలుస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 8వేల మందికిపైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. దీంతో స్వల్పంగానే ఉన్న ఓటర్లను కలిసి తమ అభ్యర్థికి ఓటేయాలని కోరుతున్నారు. ఈ ఎన్నికలు ఉపాధ్యాయులతోపాటు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజల్లోనూ ఆసక్తిని రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మేధావులైన ఉపాధ్యాయ వర్గాల తీరును ఆయా పార్టీలు ఈ ఎన్నికల ద్వారా పరిశీలించనున్నాయి.
ఉమ్మడి పాలమూరులో 8,159మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మహబూబ్నగర్లో అత్యధికంగా 3,461మంది ఓటర్లు ఉండగా, నారాయణపేట జిల్లాలో 664మంది అత్యల్ప ఓటర్లు ఉన్నారు. ఇక మిగిలిన వికారాబాద్ జిల్లాలో 1890మంది ఓటర్లు, హైదరాబాద్లో 3949మంది ఓటర్లు, మేడ్చల్-మల్కాజిగిరిలో 6536మంది ఓటర్లు ఉండగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల్లో 9,186మంది ఓటర్లు ఉన్నారు. పాలమూరులో 52పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 137పోలింగ్ కేంద్రాల్లో 29,720మంది ఓటర్లు ఉన్నారు. గెలుపునకు ఆయా సంఘాల నేతలు ఉపాధ్యాయులను పలు రకాలుగా మచ్చిక చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకుల ద్వారా ఉపాధ్యాయ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారం మరో వారం రోజులే ఉండడంతో ఎండాకాలానికి ముందే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. విద్యాసంస్థల వద్ద నిత్యం అభ్యర్థుల తరఫున చేసే ప్రచారంతో సందడిగా మారుతున్నాయి. ఇక ఎన్నికల నిర్వహణకు ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే గుర్తించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సదుపాయాల కల్పనకు ఏర్పాట్లకు ఆదేశించారు. ఎన్నికల కోసం అవసరమైన నోడల్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించనున్నారు. మొత్తం మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎండాకాలం ఆరంభంలోనే రాజకీయ మంటలు పుట్టిస్తున్నాయి.