Gaddar | అమ్రాబాద్, ఏప్రిల్ 29 : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను కొనసాగిస్తూ దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నదని ప్రజా గాయకుడు గద్దర్ ఆరోపించారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని అటవీశాఖ ఈసీ కార్యాలయంలో శనివారం రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కులాల మధ్య బీజేపీ చిచ్చుపెట్టి ప్రజల సొమ్మును బడా బాబులకు ధారాదత్తం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమ ఓటుహక్కును అమ్ముకోకుండా రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటూ.. ప్రజా వ్యతిరేక పార్టీలను గద్దెదించాలని పిలుపునిచ్చారు.
జ్యోతిరావు ఫూలేను ఆదర్శంగా తీసుకొని సనాతన విధానాన్ని అవలంబించాలని సూచించారు. తీర్మానాలతో శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే బడుగులు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ప్రతిఒక్కరూ చైతన్యవంతులై అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని కోరారు. ఆదివారం అమ్రాబాద్లో నిర్వహించే బహిరంగసభకు ఉమ్మడి మండలాల ప్రజలు, మేధావులు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు ఎల్లస్వామి, నాసరయ్య, మల్లికార్జున్, కాశీం, నిరంజన్, రామస్వామి, ఆంజనేయులు, పర్వతాలు, కళాకారులు గోపాల్, మురళి, పార్వతమ్మ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.