వనపర్తి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో సాగునీటి రాకతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్లో నీటిఎద్దడి రాకుండా పట్టణం చుట్టూ చెరువులను పటిష్టం చేసినట్లు తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు, లక్ష్మీకుంట చెరువు పనులను స్థానిక నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని చెరువులను, కుంటలను గత పాలకులు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
సాగునీరు సంగతి పక్కన పెడితే వానకాలంలోనే మంచినీటి కోసం తండ్లాడే పరిస్థితి నాడన్నారు. నాటి పరిస్థితి మళ్లీ రావొద్దని వనపర్తి చుట్టూ ఉన్న నల్ల, తాళ్ల, ఈదుల, రాజనగరం, అమ్మ చెరువు, శ్రీనివాసపురం లక్ష్మీ కుంటలను పటిష్టం చేశామని తెలిపారు. దీంతో పునాదులు తవ్వితే చాలు భూగర్భ జలాలు ఎగిసిపడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని మిగితా జిల్లాల కంటే వనపర్తి జిల్లాలో 4.40 మీటర్ల లోతునే భూగర్భ జలాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంపై దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రారంభమైతే ఈ ప్రాంతం మరో కోనసీమను మించిపోతుందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, వెంకటేశ్ పాల్గొన్నారు.