నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్గా ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డింది. ప్రతి పల్లెకూ నీళ్లు, నిధులు ఇప్పటికే పుష్కలంగా అందుతున్నాయి. ఉద్యోగాల ను కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసింది. భారీగా జాబ్లు భర్తీ చేసి నిరుద్యోగుల కలలను సాకారం చేసింది. ఈ క్రమంలో ఇటీవల బాహుబలి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించింది. యువతకు ఉద్యోగాలు దక్కితే బీఆర్ఎస్ సర్కార్కు మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో ప్రతిపక్షాలు పేపర్ లీకేజీకి పాల్పడ్డాయి. నిరుద్యోగుల ఆకాంక్షలకు భంగం కలిగిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తే లీకేజీకి సూత్రధారి అని దాదాపుగా స్పష్టమవుతున్నది. టీఎస్పీఎస్సీకి మచ్చ తీసుకొచ్చే కుట్రలకు తెరలేపాయి. ప్రతిపక్షాలు చేసిన దుశ్చర్యపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
నాగర్కర్నూల్, మార్చి 19(నమస్తే తెలంగాణ): తెలంగాణ ట్యాగ్లైన్ మూడోదైన ఉద్యోగ నియామకాలను వందశాతం నెరవేర్చే దిశలో టీఎస్పీఎస్సీ ముందుకుసాగుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 2014లో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తున్నది. మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది. పైరవీలకు తావులేకుండా ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఉన్నతమైన గ్రూప్-1,2,3 కొలువుల్లో ఇంటర్వ్యూలతో పైరవీకారులకే గతంలో ఉద్యోగాలు దక్కేవి.
దీనివల్ల పేదలకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఉండేవి. ఫలితంగా మెరిట్ మార్కులు సాధించిన పేదలు సైతం ఉన్నత కొలువుల్లో చేరే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఎస్పీఎస్సీ భారీగా గ్రూప్-1,2,3,4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ నుంచి ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి రెవెన్యూ అధికారి దాకా పలు పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు ఉద్యోగ పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత సన్నద్ధమవుతున్నది. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పూర్తిచేసుకున్న యువత ప్రస్తుతం ఇండ్ల వద్ద ప్రతిరోజూ పుస్తకాలు పట్టుకొని చదువుకుంటున్నారు.
ఇక త్వరలో ఉపాధ్యాయ, గురుకుల నోటిఫికేషన్లు రానున్నాయి. దీంతో యువతలో బీఆర్ఎస్పై మంచి అభిప్రాయం ఏర్పడింది. రాబోయే కాలంలో యువత కొలువులు సాధిస్తే తమకు నష్టం కలుగుతుందనే దురుద్దేశంతో బీజేపీ గ్రూప్స్, ఇతర పరీక్ష పేపర్ల లీకేజీకి కుట్రకు తెరతీసింది. బీజేపీ కార్యకర్తే లీకేజీకి పాత్రధారిగా దాదాపుగా తేలుతున్నది. ఈ క్రమంలో గ్రూప్-1తోపాటుగా పలు పరీక్షలను రద్దు చేయడంలో బీజేపీతో పాటుగా కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్సార్టీపీలాంటి పార్టీలు వంతపాడాయి. అదేవిధంగా టీఎస్పీఎస్సీకి మచ్చ తీసుకొచ్చే విధంగా కుట్రకు పాల్పడుతున్నాయి.
గత ఏడెనిమిదేండ్లుగా టీఎస్పీఎస్సీ ద్వారా వేలాది మంది యువత కొలువుల్లో చేరారు. జూనియర్ అసిస్టెంట్, ఏఈలుగా, మున్సిపల్ కమిషనర్లుగా, రెవెన్యూ అధికారులుగా వివిధ హోదాల్లో కొలువులు చేస్తున్నారు. దీంతో వేలాది కుటుంబాలు సంతోషంతో ఉంటున్నాయి. ఉద్యోగాల్లో చేరిన పేద యువత కొలువుల్లో భాగంగా మారారు. ఈ క్రమంలో తాజాగా వెలువడిన నోటిఫికేషన్లతో ఉద్యోగ కల సాకారమైతే తమకు నష్టమని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతుండటం గమనార్హం. ఏది ఏమైనా తెలంగాణ ట్యాగ్లైన్ ఉద్యోగ నియామకాలను చేపట్టడంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకు సాగనున్నది.
టీఎస్పీఎస్సీ అంటే నమ్మకం
టీఎస్పీఎస్సీ నిర్వహించిన గురుకుల, డీఎస్సీ రెండు పరీక్షల్లో అర్హత పొంది ఉద్యోగం సాధించాను. టీఎస్పీఎస్సీలో ఎవరికీ అన్యాయం జరగలేదు. పరీక్ష విధానం కూడా బాగుంటుంది. పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించి ఉద్యోగాలు పొందేవారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఎవరో కొంతమంది చేసిన తప్పుకు టీఎస్పీఎస్సీ బోర్డును నిందించడం సరైన పద్ధతి కాదు.
– హరిబాబు, ఉపాధ్యాయుడు
నిత్యం 10గంటలు చదివాను
నిత్యం 10గంటలు చదివాను. 2017లో పరీక్ష రాయగా 2018లో రిజల్ట్ వచ్చింది. రాష్ట్రస్థాయిలో పీజీటీలో 12వ ర్యాంకు సాధించాను. కష్టపడి చదవడం వల్లనే ఉద్యోగం సాధించాను. నాదృష్టి అంతా ఉద్యోగం సాధించడంపైనే.. పైరవీలను ఎప్పుడూ నమ్మలేదు. కష్టపడి చదివితే ఫలితం దక్కుతుందనే నమ్మకం నాకుంది. అదే నమ్మకంతో చదివాను ఉద్యోగం సాధించాను. టీఎస్పీఎస్సీని బద్నాం చేయడం తగదు. ప్రస్తుతం పీజీటీగా మైనార్టీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నాను.
– టీజీ మురళి, పీజీటీ, గోదల్, బల్మూరు మండలం
కష్టపడి ఉద్యోగం సంపాదించా..
2016లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వేయడంతో కోచింగ్ లేకుండా చదివాను. అదే సంవత్సరంలో నిర్వహించిన అర్హత పరీక్ష రాశాను. అదృష్టవశాత్తు ర్యాంకు రావడంతో 2017లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. ర్యాంకు ప్రాధాన్యతను బట్టి పోస్టింగ్ ఇచ్చారు. కానీ, ఎలాంటి అవకతవకలకు జరగకుండా ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వంగూరు మండలం జాజాల ఏఈవోగా పనిచేస్తున్నాను.
– కావలి ఆంజనేయులు, ఏఈవో, ఖానాపురం
బీఆర్ఎస్కు పేరొస్తుందనే కుట్ర
టీఎస్పీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. నోటిఫికేషన్లు రావడంతో వేలాదిమంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. యువతకు ఉద్యోగాలు వస్తే రాజకీయంగా నష్టం కలుగుతుందని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్ని పేపర్ లీకేజీతో డ్రామాలు ఆడుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా పైరవీల లేకుండా మెరిట్ ఉన్న యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.
– హరికృష్ణ, బీఆర్ఎస్వీ నాయకుడు, నాగర్కర్నూల్