అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 14 : ఆడ శిశువును అమ్మకానికి పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కిష్టతండాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ధర్మానాయక్ కథనం మేరకు.. వడ్యియా లక్ష్మి, రవి దంపతులకు గతంలోనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగు రోజుల కిందట ఓ ప్రైవేటు ద వాఖానలో మళ్లీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం.. మూడో సంతానంగా పుట్టిన కన్నబిడ్డను పోషించే స్థోమత లేకపోవడంతో శిశువును అమ్మకానికి పెట్టాలని దంపతులు నిర్ణయించుకున్నారు.
ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అచ్చంపేట పాత బస్టాండ్లో శిశువు అమ్మకం విషయంపై రూ.2.50 లక్షల బేరం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంతో ఈ విషయం వెల్లడైంది. ఇంటెలిజెన్స్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు సీడబ్ల్యూసీ, ఐసీడీఎస్ సభ్యులకు సూచించారు. వెంటనే స్పందించిన వారు తండాకు వెళ్లారు. సర్పంచ్ ధర్మానాయక్, పెద్ద మనుషులతో చర్చించి ఆ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి నుంచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవడంతో అమ్మకానికి బ్రేక్ పడిందని ఏసీడీపీవో కమల, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు.