నాగర్కర్నూల్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు సెప్టెంబర్ నెలలో పూర్తి కానున్నాయి. ఎనిమిదేండ్లుగా స్థాన చలనం కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. బదిలీల కోసం ఈ సంవత్సరం జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకొన్నారు. దీనికి సంబంధించిన హార్డ్ కాపీలను ఆన్లైన్లో ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో చేరిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీని నమోదు చేయడంతో ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయించి బదిలీ జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. స్పౌజ్ కేటగిరీ ఉద్యోగులుగా ఉన్న ఉపాధ్యాయులకు అదనపు పాయింట్లు కేటాయించాల్సి ఉంది. ఎనిమిదేండ్ల కాలంలో అదనపు పాయింట్లను ఒకసారి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. మళ్లీ ఈ గడువు ముగిశాకే అదనపు పాయింట్లు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు, వితంతులు, అవివాహిత మహిళలకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పించారు.
ఈ నేపథ్యంలో బదిలీలపై పలువురు ఉపాధ్యాయులు హైకోర్టుకు వెళ్లగా మార్చి 14 వరకు స్టే విధించారు. ఇలా కోర్టులో వాయిదాలు పడుతూ వచ్చినా.. ఎట్టకేలకు బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ దంపతులు కలిసి ఉండేలా ఇచ్చే అదనపు పది పాయింట్లను హైకోర్టు సమర్థించగా ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మాత్రం అదనపు పాయింట్లను కేటాయించలేదు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టనున్నారు. 3వ తేదీ నుంచి నెల రోజుల పాటు బదిలీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా సమాచారం.
ఇంతకు ముందు చేసిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకొని బదిలీలను చేపట్టనున్నారు. గత కొన్నేండ్లుగా ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్నారు. దీనివల్ల ఉపాధ్యాయుల్లో మానసిక ఒత్తిడి కలుగుతున్నది. ఇక భార్యాభర్తలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయులు సైతం ఒకే ప్రాంతంలో పని చేసేందుకు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు వేసిన కేసులతో హైకోర్టులో కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బదిలీలు ఎట్టకేలకు సెప్టెంబర్లో జరగనుండటంతో ఉపాధ్యాయులు, కుటుంబీకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 3 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా దాదాపుగా 50 శాతం మందికి బదిలీలతో మేలు చేకూరనున్నది.
నిబంధనల మేరకు బదిలీలు
హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 3 వేల మందికిపైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. గతంలో ఫిబ్రవరి కటాఫ్గా తీసుకోవడంతో 50 శాతం మంది, దీన్ని సెప్టెంబర్గా తీసుకుంటే 75 శాతం మంది బదిలీకి అర్హత సాధిస్తారు. ఒకట్రెండు రోజుల్లో బదిలీల షెడ్యూల్ విడుదల కానుండగా.. ఈ మేరకు ప్రక్రియ చేపడుతాం.
– గోవిందరాజులు, డీఈవో నాగర్కర్నూల్