మహబూబ్నగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ చీకటి రాజ్యం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం చేసి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్కు కండ్లు మండుతున్నాయి. రైతులు బాగుపడుతుంటే ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు మళ్లీ కరెంట్ కష్టాలు తీసుకురావాలని చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నాయకుల కుటిల బుద్ధి ఒక్కొక్కటీ బయటపడుతుంది. అధికారం కోసం పాకులాడుతూ బీఆర్ఎస్ను ఢీకొనే సత్తా లేక ప్రభుత్వంపై లేనిపోని అభాండాలను వేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్వయంగా ఓ సమావేశంలో రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలంటూ ఎదురు ప్రశ్నించారు. 95 శాతం మంది రైతులు మూడు ఎకరాల్లోపే ఉన్నారని, వారికి 8 గంటల కరెంట్ ఇస్తే చాలని చేసిన వాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీనిపై బీఆర్ఎస్, రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెసోళ్లు కరెంట్ లేని దుస్థితిని తీసుకురావాలని కుట్రకు పాల్పడుతున్నారని నేతలు ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలను సమర్థించలేక స్వయాన కాంగ్రెస్ నేతలే ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటే అందుకు సీఎం కేసీఆర్ ముందుచూపే కారణమని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం లాఠీ దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తు చేశారు. పొద్దున మూడు గంటలు.. రాత్రి మూడు గంటలు కరెంటు ఇచ్చి రైతులను పొలాల వద్ద జాగారం చేయించిన రోజులు రైతన్నలు మరిచిపోలేదని ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు..