ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) డ్రై రన్కు సిద్ధమైంది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ పరిధిలోని మొదటి ప్యాకేజీ జీరో పాయింట్ వద్ద చేపట్టిన పంప్హౌజ్లో ఒక మోటరుకు విద్యుత్ సరఫరా అందించి డ్రైరన్ను చేపట్టనున్నారు. ఈ మేరకు ప్యాకేజీ పనులు దక్కించుకున్న మెగా కంపెనీ, ఇంజినీరింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోటర్ను రన్ చేశాక ఎక్కడైనా సాంకేతిక లోపాలుంటే సవరించనున్నారు. ఆ తర్వాత పంప్ ద్వారా నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి పంపింగ్ చేయనున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో రెండో పంప్ను కూడా డ్రైరన్కు సిద్ధం చేయనున్నట్లు సీఈ హమీద్ఖాన్ తెలిపారు. డ్రైరన్ సవ్యంగా జరిగితే 15 రోజుల్లో వెట్న్ చేపట్టనున్నామని వివరించారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డ్రై రన్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్లోని మొదటి ప్యాకేజీ జీరో పాయింట్ వద్ద చేపట్టిన పంప్హౌస్లో ఒక మోటర్ను విద్యుత్ సరఫరా అందించి డ్రై రన్ను చేపట్టనున్నారు. ఈనెల 3వ తేదీ ఆదివారం డ్రై రన్ చేసేందుకు డెడ్లైన్ విధించుకున్నారు. ఈ మేరకు ప్యాకేజీ పనులు దక్కించుకున్న మెగా కంపెనీ, ఇంజినీరింగ్ అధికారులు రేయింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. డ్రై రన్ చేపట్టిన 15 రోజులకు వెట్న్ చేపడుతామని పాలమూరు రంగారెడ్డి చీఫ్ ఇంజినీర్ హమీద్ఖాన్ వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు లభించడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది.
ఈ ప్రాజెక్టు వివరాలను ప్రతి రోజూ అడిగి తెలుసుకుంటున్నారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇది వరకే నార్లాపూర్ వద్ద పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్ష చేసి వీలైనంత త్వరలో పంప్లు ఆన్ చేసే విషయంపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం డ్రై రన్ను నిర్వహించేందుకు ఇంజినీరింగ్ అధికారులు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. ప్యాకేజీ పనులు దక్కించుకున్న కంపెనీ ప్రతినిథులతో కలిసి ఇంజినీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు దగ్గరుండి పనులను చేయిస్తున్నారు. అనుకున్నట్లుగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద సాగుతున్న పనులు..
కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామ సమీపంలోని కోతిగుండు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది జలాలను తరలించేందుకు 2.75 కిలోమీటర్ల కాల్వను సిద్ధం చేశారు. గ్రావిటీ కాల్వ వద్ద హెడ్రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అవసరమున్న మేర వచ్చిన జలాలను మూడు టన్నెళ్లలోకి మళ్లించి సర్జిపూల్లోకి తరలిస్తారు. సర్జిపూల్ను ఆనుకుని పంప్హౌజ్ను నిర్మించారు. ఈ పంప్హౌస్లో 145 మెగావాట్ల సామ్యర్థం గల 9 మోటర్లను బిగిస్తున్నారు. ఒక్కో మోటరు 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం 5 టీఎంసీలు. నార్లాపూర్ వద్ద రిజర్వాయర్ను ప్రయోగాత్మకంగా 2 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయనున్నారు. అన్నీ సిద్ధమైతే ఇక్కడి నుంచి ఏదుల పంప్హౌస్కు గ్రావిటీ, టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు. మోటార్ల సామర్థ్యానికి తగ్గట్లు 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించారు. ఒక్కో మోటరుకు 127 మెగావాట్ల విద్యుత్ను అందించి ఆన్ చేస్తారు.
ఈనెల 3న డ్రై రన్కు ఏర్పాట్లు..
నార్లాపూర్ పంప్హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పంప్లో ఒక మోటరును ఈనెల 3వ తేదీన ఆన్ చేయనున్నారు. ఈ మేరకు మోటరుకు విద్యుత్ ఉత్పత్తిని అందించే ప్యానల్ను సిద్ధం చేశారు. సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను అందించి మోటర్ను రన్ చేయనున్నారు. రన్ చేశాక ఎక్కడైనా సాంకేతిక లోపాలుంటే సవరించి పూర్తి స్థాయిలో పరీక్షించనున్నారు. ఏవైనా సాంకేతిక లోపాలంటే సరిచేసి పంప్ ద్వారా నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి పంపింగ్ చేయనున్నారు. ఈ పంప్ నుంచి రిజర్వాయర్ వరకు 15 మీటర్ల వ్యాసార్థం గల భారీ ఇనుప పైప్లను సిద్ధం చేశారు. ఒక్కో పంప్ 0.25 టీఎంసీల నీటిని పంపింగ్ చేయనున్నారు. మోటరు ఆన్, ఆఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మరో 15 రోజుల్లోగా వెట్న్ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెట్న్ కూడా ప్రయోగాత్మకంగా పరిశీలించాక పూర్తిస్థాయిలో నీటిని పంపింగ్ చేయనున్నారు.
డ్రై రన్కు ఏర్పాట్లు పూర్తి చేశాం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ-1లో నార్లాపూర్ పంపింగ్ హౌ స్లో ఒక మోటరును ఈనెల 3న డ్రై రన్ చేసి పరీక్షించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నార్లాపూర్ మొదటి పంప్హౌస్ ఇది. 145 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పంప్హౌస్ ద్వారా 3వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాం. అందులో భాగంగా మొదటి పంప్ను డ్రై రన్కు సిద్ధం చేస్తున్నాం. మరో మూడు, నాలుగు రోజుల్లో రెండో పంప్ను కూడా డ్రై రన్కు సిద్ధం చేసేలా అధికారులు, కార్మికులు 24గంటలపాటు శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరగా నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.
-హమీద్ఖాన్, సీఈ