మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 30 : కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం.. జీవితం రెప్పపాటే అయినా.. మనిషి ఆయుష్షు వందేండ్లు. పుట్టక మొదలు చనిపోయేవరకు మనిషి ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రాణాలను కాపాడేది వైద్యం. అందుకే వైద్యం చేసేవారిని సాక్షాత్తు నారాయణుడితో పోలుస్తారు. ప్రాణదాతగా గౌరవిస్తారు. మృత్యుఒడిలోకి చేరే వారికి సైతం వైద్యులు ప్రాణం పోస్తారు. ఆధునిక వైద్యశాస్త్రంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలతో వైద్యులు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. వైద్యం వ్యాపారమయంగా మారిపోయిన ఈ రోజుల్లో కూడా ఆదర్శప్రాయమైన డాక్టర్లు ఉన్నారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పేదలకు వైద్యం అందినప్పుడే సార్థకత
వైద్యవృత్తి ఎంతో గౌరవప్రదమైనది. ప్రతి ఉద్యోగికీ ఉద్యోగ విరమణ ఉంటుంది. కానీ వైద్యుడికి మాత్రం ఉండదు. తాను చనిపోయే వరకు వైద్యం అందిస్తూనే ఉంటారు. ప్రతి వైద్యుడు సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి. డబ్బు సంపాదించాలనే ధోరణిని మరిచిపోవాలి. డాక్టర్ బీసీ రాయ్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ దవాఖానకు వచ్చిన పేదవారికి వైద్యం అందిస్తున్నాను.
– డాక్టర్ జీవన్, సివిల్ సర్జన్ హెచ్వోడీ, పాలమూరు
ప్రజలకు వైద్యం చేయాలనే..
పేదలకు సేవచేయాలనే భావంతో వైద్యవృత్తిని ఎంచుకున్నాను. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జనరల్ దవాఖానకు వచ్చే రోగుల కోసం అవసరమయ్యే వసతులు, వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. రాత్రి, పగలు తేడా లేకుండా దవాఖానలోని క్వార్టర్స్లో ఉంటూ 24 గంటలపాటు విధుల్లో కొనసాగుతూ ప్రభుత్వ దవాఖానలను ముందుకు తీసుకెళ్తున్నాను. వైద్యవృత్తి సేవా దృక్పథంతో ముడిపడి ఉంటుంది. డబ్బుల కోసమే కాకుండా స్వచ్ఛందంగా వైద్య సేవలందించాలి. రాష్ట్రంలోనే ఉత్తమ డాక్టర్ అవార్డుకు ఎంపికయ్యాను.
– డాక్టర్ డి.రాంకిషన్, పాలమూరు దవాఖాన సూపరింటెండెంట్,
మానవసేవే.. మాధవ సేవ..
ప్రజలకు సేవచేస్తే మాధవుడికి చేసినట్లుగా భావిస్తున్న. పేదలకు వైద్యసేవలు అందించే డాక్టర్ వృత్తిని ఎంచుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. డాక్టర్ బీధార్ చంద్రారాయ్ ఆదర్శంగా పేదలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు ముందుకు రావాలి. ఆయన స్ఫూర్తితోనే పనిచేసి వైద్య వృత్తికి గుర్తింపు తీసుకురావాలి. 27 ఏండ్లు జిల్లా దవాఖానలో వైద్య సేవలందించాను. దవాఖానకు వచ్చే రోగులకు ఆవసరమయ్యే వసతులు, మెడికల్ కళాశాల తెచ్చేందుకు కృషిచేశాను. ఓ డాక్టర్గా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ రోగులకు ఉత్తమ సేవలు అందిస్తున్న.
– డా.శ్యామూల్, రిటైర్డ్ సూపరింటెండెంట్, పాలమూరు దవాఖాన
నిరంతరం సేవలందిస్తున్నాం..
నా వద్దకు వచ్చే రోగి ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నాం. అయినా డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. ఏ వైద్యుడికీ రోగిని చంపాలనే ఉద్దేశం ఉండదు. కానీ అనుకోని పరిస్థితిలో చనిపోతుంటారు. ఇందుకు ప్రజలు దవాఖానలు, వైద్యులపై దాడి చేయడం సరైంది కాదు. ఇందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటి ద్వారా న్యాయం పొందాలి. కాని దాడి చేయడం సమాజానికి మంచిది కాదు.
– డాక్టర్ రామ్మోహన్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్