గద్వాల టౌన్/వనపర్తి, జనవరి 13 ; సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. పుడమి తల్లి పసిడి పంటలు అందించగా.. ప్రకృతి సింగారించుకుని పర్వదినానికి స్వాగతం పలుకగా… పట్టు పరికిణీలతో ఆడపడుచులు సందడి చేయగా.. ఇలా మూడ్రోజుల ముచ్చటైన పండుగ.. ముత్యాల ముగ్గులతో లోగిళ్లు నిండగా.. భోగ భాగ్యాలతో భోగి చేసుకోగా.. సంక్రాంతి సకల సంపదలు తేగా.. కనుమ కలిసి మెలిసి ఉండాలని దీవించే పొంగల్.. ఐష్టెశ్వర్యాలు సిద్ధించాలని.. ఆయురారోగ్యాలు సొంతమవ్వాలని.. మనసారా ఆకాంక్షిస్తూ.. కనువిందుగా నిర్వహించే పండుగ. తెలుగు లోగిళ్లలో నిండైన కాంతి.. గొబ్బెమ్మలు, నవధాన్యాలు, పతంగుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు.. కోడిపందేలు.. ఇలా పల్లె వాకిట ఆనందాన్ని నింపే పర్వదినం సంక్రాంతి. ఆదివారం నుంచి పండుగ షురూ కానున్నది. దీంతో ప్రతి ఇల్లు కూడా రంగుల హరివిల్లు కానున్నది.
భోగి ముచ్చట్లు
సంక్రాంతికి ముందు రోజు భోగి జరుపుకొంటారు. ఈ రోజు సూర్యుడు ధనుష్ రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. స్వర్గలోకపు వాకిళ్లు తెరుస్తారని నమ్మకం ఉన్నది. మన రాష్ట్రంలో భోగిగా, రాజస్థాన్లో మకర సక్రాత్గా, పంజాబ్లో హరిగా, నేపాల్లో మాఘె సంక్రాంతిగా, థాయి లాండ్లో సోంగ్క్రమ్గా, మయన్మార్లో థింగ్యాన్గా, అస్సాంలో బోగళిబెహుగా, తమిళనాడులో పొంగల్గా, ఒడిశాలో కొత్త సంవత్సరం ప్రారంభంగా భోగిని నిర్వహిస్తారు. పాత వస్తువులన్నింటినీ అంటించి భోగి మంటగా అభివర్ణిస్తూ మంట చుట్టూ బొడ్డెమ్మలు ఆడడం ఆనవాయితీ. అలాగే మహిళలు సంక్రాంతి నోములు ఆచరిస్తారు. ఈరోజు నువ్వులు, బెల్లం, గుమ్మడి కాయలు, కూరగాయలు దానం చేస్తారు. చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసి ఆశీర్వదిస్తారు.
ఇలా చేస్తే విష్ణుమూర్తి స్వయంగా పిల్లలను దీవిస్తాడని ప్రతీతి.
సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. సిరులెన్నో తెచ్చింది. ఈ పండుగ ఎన్నో సంప్రదాయాలు, రంగులతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లలో డూడూ బసవన్నలు, హరిదాసులు, పగటి వేషగాళ్లు, ఎడ్లపందేలు, కుర్వ డోళ్ల సందడి మరింత ఆకర్షిణీయంగా నిలుస్తాయి. పంట చేతికొచ్చిన తర్వాత రైతులు సంతోషంగా జరుపుకొనే పెద్ద పండుగ. ఏడాది కాలంలో ఆరు నెలలు ఉత్తరాయణం అని, ఆరు నెలలు దక్షిణాయణమని అందరికీ తెలిసిందే. ఇంతటి ప్రాముఖ్యత గల సంక్రాంతి పండుగ విశేషాలను తెలుసుకుందామా..
మకర సంక్రాంతి..
నక్షత్రాలన్నింటినీ కలిపి 108 పాదాలుగా.. 108 పాదాలను 12 రాశులుగా విభజించారు. ఈ నెలలో సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు.. అందుకే మకర సంక్రాంతి అంటారు. తెలంగాణ ప్రాంతంలో నువ్వులు, బెల్లం, కలిసి లడ్డూలు, నువ్వుల రొట్టెలు, చెకోడీలు, చకినాలు వంటి వంటలు తయారు చేస్తారు. అలాగే కూరగాయాలన్నింటినీ వాయనంగా సమర్పించుకుంటారు. మకర సంక్రమణం రోజు నువ్వుల నూనెలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. తలకు నూనె రాసుకుని శనగపిండితో స్నానం చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నది విశ్వాసం.
తండ్రీకొడుకుల అనుబంధానికి..
సంక్రాంతి పండుగ తండ్రి, కొడుకుల అనుబంధానికి ప్రతీక అని ఎంతమందికి తెలుసు. ఆ తండ్రీకొడుకులు ఎవరు అనుకుంటున్నారా.? వారే సూర్యుడు, శని. మకర రాశి అధిపతి అయిన శనీశ్వరుడి ఇంటికి ప్రతి ఏడాది సంక్రాంతి రోజున మాత్రమే సూర్యుడు వెళ్తాడని, అందుకే సంక్రాంతికి సూర్య, శనిల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకుంటారు. అంతేకాక భగీరథుడు తపస్సు చేసి గంగను భూమిపైకి రప్పించినది కూడా ఈరోజే అని పురాణాలు చెబుతున్నాయి.
కనుమ పండుగ
మూడ్రోజుల పాటు జరుపుకొనే సంక్రాంతి పండుగలో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పండుగను పశువుల పండగగా జరుపుకోవడం ఆనవాయితీ. కనుమ అంటే పశువు అని అర్థం. ఏడాదిపా టు పొలం పనుల్లో తమకు చేదోడు వాదోడుగా ఉన్న పశువులను పూజించడం ఆనవాయితీ. పుశువులు, కొట్టాలను అలంకరిస్తారు. పొంగలిని నైవేద్యం గా సమర్పిస్తారు. అలాగే నేవైద్యాన్ని పొలంలో చల్లి పాడి పంటలు బాగా పండాలని వేడుకుంటారు.
ముగ్గుల సంస్కృతి
ముగ్గుల సంస్కృతి ఈ నాటిది కాదని, ఈ సంప్రదాయం వేలాది ఏళ్ల నాటి మొహంజొదారో, హరప్పా నాగరికతల నుంచి మొదలైందని చెబుతారు. అదే సంస్కృతిని నేడు దేశమంతటా,వివిధ రాష్ర్టాలలో జరుపుకొనే భోగి, సంక్రాంతి, కనుమల రోజు ఆడపడుచులు తమ ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులను వేస్తారు. వీటి మధ్యలో గొబ్బెమ్మలు ఉంచుతారు. ముగ్గును
లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. గొబ్బెమ్మలను పూజిస్తే శుభాలు కలుగుతాయన్నది నమ్మకం.
డూడూ బసవన్నల సందళ్లు
రావమ్మా మహాలక్ష్మీ.. రావమ్మా.. అంటూ హరిదాసుల సంకీర్తనలు, పిల్లాపాపలు సల్లంగుండాలని డూడూ బసవన్నలు దీవించే దృశ్యాలు నేడు పూర్తిగా కనుమరుగయ్యాయనే చెప్పాలి. అప్పుడప్పుడు అడపాదడపా కనిపించే దృశ్యాలను తిలకించడానికి పిల్లలు ఆరాటపడడం కనిపిస్తున్నది.
ఊరూరా కైట్ ఫెస్ట్తయారీ విధానం
పంతగులను తయారు చేయటానికి జెండా, న్యూస్ పేపర్లు వాడేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ను వాడుతున్నారు. ముందుగా పేపర్ను చతురస్రాకారంలో తీసుకుని కత్తిరించాలి. రెండు వెదురు పుల్లలను తీసుకుని ఒక మూల నుంచి మరో మూలకు పుల్లను అతికించాలి. తర్వాత రెండో పుల్లను అర్ధచంద్రకారంలో ఒక మూల నుంచి మరో మూలకు అతికించాలి. దీంతో గాలిపటం తయారవుతుంది. అయితే ఎగరాలంటే సూత్రం ముఖ్యం. రెండు పుల్లలు కలిసే చోట ఒక ముడి మరో ముడిని కొద్ది దూరంలో కింది భాగంలో వేయాలి. సూత్రం ఆధారంగా గాలిపటానికి ధారం కట్టి గాలిలో
ఎగురవేయాలి.
సజ్జ రొట్టెలు ప్రత్యేకం
సంక్రాంతి పండుగకు సజ్జ రొట్టెలు ప్రత్యేకం. భోగి, మకర సంక్రాంతి పర్వదినాల్లో తీపి వంటకాలతో పాటు ప్రత్యేకంగా ఈ రొట్టెలను ఆరగిస్తారు. వీటిపై నూగులను అంటించి, కలగూరలతో కలిపి తింటే ఆ రుచే వేరు.