కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 28 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా బీడు భూముల్లో బంగారు పం టలను పండించేందుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 6.40 టీఎంసీల సామర్థ్యంతో నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ ఉన్నది. సీఎం కేసీఆర్ పీఆర్ఎల్ఐని ప్రారంభించిన తర్వాత బుధవారం సాయంత్రం నుంచి మొదటి పంప్ ద్వా రా సెకన్కు 3000 క్యూసెక్కుల నీటిని అంజనగిరి రిజర్వాయర్లోకి చేరుతున్నాయి. మొదటి విడుతగా బండ్ తడిసి గట్టిపడే విధంగా రిజర్వాయర్లోకి 2 టీఎంసీల నీళ్లు చేరే వరకు పంపింగ్ కొనసాగనున్నది. గురువారం సాయంత్రం నాటికి అంజనగిరి రిజర్వాయర్లోకి 0.15టీఎంసీల నీళ్లు చేరాయి.
పర్యాటక కేంద్రంగా పీఆర్ఎల్ఐ మొదటి లిఫ్ట్..
సహజసిద్ధ్దమైన ప్రకృతి అందాల మధ్య, సప్తనదుల సంగమం కొలువైన చోట పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిప్ట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. పీఆర్ఎల్తోపాటు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు కూడా సమీపంలో ఉండడంతో కల్ప వృక్షాలుగా రైతుల పాలిట ప్రాజెక్టులు ఉన్నాయి. అంజనగిరి రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల సామర్థ్యం కల్గిన ఎల్లూరు రిజర్వాయర్కు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కోరిక మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కొల్లాపూర్ నియోజకవర్గంతోపాటు వనపర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు నిరంతరంగా సాగునీరు అందనున్నది.