గద్వాల అర్బన్, జనవరి 20 : విందు కోసం వెళ్లి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు అక్కికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్, పవన్కుమార్, ఆంజనేయులు, గోవర్ధన్, నవీన్, మహబూబ్ ఓ ప్రైవేట్ దవాఖానలో పని చేస్తున్నారు. శుక్రవారం సంబంధిత దవాఖాన వైద్యుడు తన కూతురు జన్మదిన వేడుకలు నిర్వహించగా, వీరు వెళ్లారు. వేడుకల అనంతరం విందు ఏర్పాటు చేసుకొని జల్సా చేశారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో వైద్యుడి కారును అనుమతి లేకుండా తీసుకొని గద్వాల నుంచి ఎర్రవల్లి వెళ్తున్న క్రమంలో జమ్మిచేడు వద్ద వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న నరేశ్(23), పవన్కుమార్(28), ఆంజనేయులు(50) అక్కడికక్కడే మృతిచెందగా, నవీన్, మహబూబ్లకు గాయాలయ్యాయి. మరో వ్యక్తి గోవర్ధ్దన్కు ఎలాంటి గాయాలు కాలేదు. గమనించిన స్థానికులు చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి బోరున విలపించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, బండ్ల జ్యోతి దంపతులు, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైన మహబూబ్పై గద్వాల రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.