Aadhar Card Updation | ఆధార్.. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటిలో కీలకంగా మారింది. 2014 కంటే ముందు ఆధార్ పొందిన వారు అప్డేట్ చేసుకోవాల్సిందే. కార్డును నవీకరణ చేసుకొనేందుకు జూన్ 14 వరకు ప్రభుత్వం గడువు విధించింది. చిన్నారులకు కార్డు తీసుకొని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. పోస్టాఫీసులు, బ్యాంకులు, శాశ్వత ఆధార్ కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి అప్డేట్ చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలోని 165 ఆధార్ కేంద్రాల పరిధిలో 40 శాతం వరకు అప్డేట్ ప్రక్రియ జరిగినట్లు అంచనా.
నాగర్కర్నూల్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఆధార్కార్డును (నవీకరణ) అప్డేట్ చేసుకునే గడువును ప్రభుత్వం జూన్ 14 వరకు పొడిగించింది. పదేండ్ల కిందట ఆధార్కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచిస్తోంది. 2009లో ఆధార్ నమోదు ప్రారంభవమగా గ్రామాలు, పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి వేలిముద్రలు, కనుపాపలు, ఫొటోలతో ప్రతిఒక్కరికీ కార్డులను జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆధార్ ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవహారాల్లోనూ ప్రామాణికంగా మారింది. సిమ్కార్డు, వాహనాల కొనుగోలుకు, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాల్లోనూ ఆధార్ ప్రామాణింగా మారింది. విద్యార్థులకు ఉపకారవేతనాలకు, రైతులు, దళితులు, గిరిజనులు, బీసీలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలకూ ఆధార్ అనుసంధానం తప్పనిసరైంది. చాలా ఏండ్లుగా ఆధార్లో కొన్ని మార్పులకు యూపీడీఐఏ అవకాశం కల్పించలేదు. అందులో ప్రధానంగా 2010-18వరకు ఆధార్ నమోదు చేసుకున్న కార్డుదారుల బంధుత్వాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంది.
తండ్రి(సన్నాఫ్), భర్త(వైఫ్ ఆఫ్) వంటి వాటిని ఇప్పుడు మార్చుకోవచ్చు. ప్రస్తుతం దీనికి ఆయాస్థానాల్లో కేరాఫ్గా కొనసాగిస్తున్నారు. ఆధార్ నవీకరణలో బంధుత్వాల మార్పుతోపాటు ఫోన్ నెంబర్లు, పుట్టినతేదీ, ఫొటో, చిరునామా వంటివి అప్డేట్ ద్వారా చేసుకోవచ్చు. 2014కు ముందు నుంచి కార్డుపొందిన ప్రతిఒక్కరూ ఆధార్ను నవీకరించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రజలు తమ పదోతరగతి, పాన్, ఓటర్ కార్డు, పాస్పోర్టుల్లో ఏదో ఒకటి జతపర్చాలి. ఇందులో చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతిముద్రలతో ఆధార్కార్డు జారీ చేస్తారు. వారికి ఐదేండ్లు పూర్తయ్యాక వారి వేలిముద్రలు, ఫొటోలను అప్డేట్ చేసుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రంలోనూ అప్డేట్ చేయించుకోవాలి. ఈక్రమంలో 70ఏండ్లు దాటిన వారికి అప్డేట్ నుంచి మినహాయింపు కల్పించారు. ఈనెల 30తో ఆధార్ నవీకరణకు గడువు ముగియగా 40శాతం మంది మాత్రమే అప్డేట్ చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జూన్ 14వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్లైన్లో ఆధార్కార్డును స్వతహాగా అప్డేట్ చేసుకోవచ్చు. కంప్యూటర్పై అవగాహన ఉన్న వారు మై ఆధార్ పోర్టల్, ఎం-ఆధార్ యాప్ ద్వారా మూడు నెలలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మండలాల్లోని శాశ్వత ఆధార్ కేంద్రాల్లోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఉమ్మడి పాలమూరులోని ఐదుజిల్లాల్లో 2011జనాభా ప్రకారం దాదాపు 35లక్షల జనాభా ఉండగా 40శాతం మంది అప్డేట్ చేసుకున్నట్లు అధికారుల అంచనా.
ఆధార్ పొంది పదేండ్లు పూర్తయిన ప్రతిఒక్కరూ కార్డును అప్డేట్ చేసుకోవాలి. పోస్టాఫీసులు, బ్యాంకులు, శాశ్వత ఆధార్కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి నవీకరణ చేసుకోవచ్చు. స్వతహాగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం ఉన్నది. ప్రతి వ్యవహారానికి ఆధార్ ప్రామాణికంగా మారింది కనుక ప్రజలు జూన్ 14వరకు తప్పకుండా ఆధార్కార్డును అప్డేట్ చేసుకోవాలి.
– మోతీలాల్, అదనపు కలెక్టర్