దేవరకద్ర, మార్చి 14 : గతేడాది మాదిరి ఈ ఏడాది యాసంగిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పం టలు సాగు చేసుకోవచ్చన్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంట పొలాలకు సాగునీరు లేక బీటలు బారుతున్నాయి. దీంతో చేసేది లేక రైతులు తమ పంటలను పశువుల మేత కోసం వదిలేస్తున్నారు. మండలంలోని కోయిల్సాగర్, చిన్నరాజమూర్, అజిలాపూర్, పెద్దరాజమూర్, నాగారం, గోపన్పల్లి తదితర గ్రామాల్లో రైతుల బోరు బావుల కింద దాదాపు 4,150 ఎకరాల్లో వరి సాగు చేశారు.
కానీ బోర్లలో నీరు మొత్తం అడుగంటి పోవడంతో బోరుబావుల కింద సాగు చేసిన భూ ములన్నీ ఎండిపోతున్నాయి. అజిలాపూర్కు చెందిన రైతు కృష్ణారెడ్డి ఐదు ఎకరాల భూమిలో రెండు బోర్ల కింద వరి పంటను సాగు చేయగా కొన్ని రోజుల నుంచి బోర్లలో నీరు రాకపోవడంతో పొట్టదశలో ఉన్న పంట మొత్తం ఎండిపోయి పొలం అంతా బీటలు బారడంతో సదరు రైతు తన పంట ను గొర్రెలు, పశువులకు మేతకు వదిలేశాడు. ఇలా చాలా గ్రామాల్లో చేతికందివస్తున్న పంటలను కాపాడుకోలేక పశువులకు మేతకు వదిలేస్తున్నారు. అయితే పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.