నర్వ, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధ్దికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో దళితబంధు కింద మంజూరైన 13 యూనిట్లను ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభివృద్ధ్దికి దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, పార్టీలకు అతీతంగా పారదర్శకంగా లబ్ధ్దిదారులను ఎంపిక చేయాలని తమను ఆదేశించారని తెలిపారు. అలాగే లబ్ధిదారులు ప్రణాళికాబద్ధంగా దళితబంధు ద్వారా తమ వృత్తి వ్యాపారాలను కొనసాగిస్తూ మిగతా పది కుటుంబాలకు జీవనోపాధి కల్పించేలా ఎదగాలన్నారు.
త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధ్దికి మరిన్ని పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ వీణావతి, విండో వైస్చైర్మన్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మండ్ల చిన్నయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు దండు అయ్యప్ప, హన్మంతురెడ్డి, గడ్డం నర్సింహ, దండు శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఎంపీడీవో, గ్రామకార్యదర్శి తదితరులున్నారు.
ఆధ్యాత్మిక చింతనతో జీవితానికి సార్థకత
మక్తల్ టౌన్, డిసెంబర్ 28: నేటి సమాజంలో ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవడంతోనే మానవ జీవితానికి సార్థకత లభిస్తుందని ఎమ్యెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో వెలిసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విశ్వేశ్వర ద్వితీయ వర్ధంతి సందర్బంగా బుధవారం ఆలయంలో ఏర్పాటుచేసిన ఆరాధనోత్సవానికి ఎమ్యెల్యే చిట్టెం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకుడు శ్యాంసుందర్జోషి ఎమ్యెల్యే చిట్టెంను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వేశ్వర తీర్థులవారు ధార్మిక సామాజిక రంగాల్లో చేసిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు.
సమాజానికి చేసిన సేవలకుగాను విశ్వేశ్వర తీర్థులవారికి 2020 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. స్వామివారి ఆరాధనోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆరాధన, రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మాక సేవాభావంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే చిట్టెం సూచించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్యాం సుందర్ జోషి, విద్వాన్ రాఘవేంద్ర, ప్రాణేశాచారి, గోవింద్రావు, వెంకటేశాచారి , సురేంద్రాచారి ఉన్నారు.