జడ్చర్లటౌన్, డిసెంబర్ 19: జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు సమస్యతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర నెలల కిందట రైల్వేగేటు మూతపడటంతో పట్టణంలోని కొత్తబజార్, పాతబజార్ ప్రాంతాల ప్రజలకు రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణంలోని ఇరు ప్రాంతాల ప్రజల ఇక్కట్లను గుర్తించి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యామ్నాయంగా స్థానిక గౌడ ఫంక్షన్హాల్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దీంతో ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్లేందుకు సౌలభ్యం లభించింది. కానీ ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్లు, లారీలు వెళ్లాలంటే దాదాపు 2కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి సిగ్నల్గడ్డ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడుగా సిగ్నల్గడ్డ వద్ద జాతీయరహదారి విస్తరణ పనులు చేపడుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. దీంతో కొత్తబజార్, పాతబజార్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. రైల్వేగేటు మూతపడటంతో ప్రధానంగా ఇరు ప్రాంతాల్లో వ్యాపారాలపై ప్రభావం ఏర్పడింది. చిరువ్యాపారులు గిరాకీ లేక అవస్థలు పడుతున్నారు. రైల్వేగేటు సమస్యతో ఆర్థికంగా నష్టపోతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. పాతబజార్కు కూతవేటు దూరంలో ఉన్న దవాఖాన, కూరగాయల మార్కెట్కు వెళ్లాలంటే రైల్వేగేటు మూతపడటంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని పాతబజార్వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో దవాఖానకు చేరుకోవడం లేదని పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేగేటు మూతపడటంతో ఆటోలు సైతం పాతబజార్కు రావడం లేదని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పరిసర గ్రామాల నుంచి వచ్చే రైతులు పండించిన సరుకులను అమ్మేందుకు రైల్వేగేటు మీదుగా మార్కెట్యార్డుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, రైల్వేగేటు మూతపడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఆలూరు, మల్లెబోయిన్పల్లి, యాసాయికుంటతండా, భూరెడ్డిపల్లి గ్రామాల రైతులు జడ్చర్ల మార్కెట్యార్డుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జడ్చర్ల రైల్వేగేటు సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా రైల్వేశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు చేయించారు. రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరైనది, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు మూడు నెలల కిందట జడ్చర్ల రైల్వేస్టేషన్ సందర్శనకు వచ్చిన రైల్వే జనరల్ మేనేజర్, డీఆర్ఎంలు వెల్లడించారు. కానీ, ఇప్పటికీ రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టలేదు. త్వరగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రైల్వే అధికారులకు వినతిపత్రాలు సమర్పించుకుంటున్నారు. కానీ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. జడ్చర్ల రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదని, ఎప్పుడు ప్రారంభిస్తారోనని పట్టణవాసులు ఎదురుచూస్తున్నారు. మంగళవారం రైల్వే జనరల్ మేనేజర్ పర్యటించనున్న నేపథ్యంలో జడ్చర్ల రైల్వేగూడ్స్ ఫ్లాట్ఫాంను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల అండర్ బ్రిడ్జి పనుల గురించి మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు పట్టణ ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.