నాగర్కర్నూల్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది వివరాలను టీపోల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీల వారీగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించింది. ఓటర్ల జాబితాను జీపీ, వార్డుల వారీగా విభజించి.. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నది. ఈ ప్రక్రియను నెలరోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 1692 గ్రామపంచాయతీల్లో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు.
ఇప్పుడిప్పుడే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ సందడిని మరువకముందే పల్లెల్లోనూ ఎన్నికల సంబురానికి తెరలేచింది. జనవరి 31వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియనుండడంతో ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టడంతోపాటుగా గ్రామస్థాయిలోనూ చేపట్టాల్సిన కార్యాచరణపై పంచాయతీ అధికారులకు, ఎన్నికలను పర్యవేక్షించే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గడువులోగా ఎన్నికలకు శ్రీకారం చుడితే మరోమారు పల్లెల్లో రాజకీయ వేడి రాజుకోనున్నది.
ఇక పల్లెపోరు..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అశోక్కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైన ఏర్పాట్లను చేపట్టాల్సిందిగా ఈసీ ఆదేశించడం గమనార్హం. ఇంతకుముందు 2019 ఫిబ్రవరి 1నుంచి అమలులోకి వచ్చిన పంచాయతీ పాలకవర్గాల ఐదేండ్ల పదవీకాలం జనవరి నెలాఖరుతో ము గియనున్నది. దీంతో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు అవసరమైన కార్యాచరణను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఓటర్ల వారీగా పోలింగ్ బూత్లు, సి బ్బంది నియామకాలకు సంబంధించి స్పష్టంగా పే ర్కొనడం జరిగింది. ఈ క్రమంలో 200ఓటర్లు ఉ న్న పంచాయతీకి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి ఉంటారు. అలాగే 400ఓటర్ల వ రకు ఒక పీవో, ఇద్దరు పోలింగ్ అధికారులు, 650 ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో ఒక పీవో, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించడం జరుగుతుంది.
అలాగే అదనంగా 20శాతం మందిని ఎం పిక చేసి రిజర్వ్లో ఉంచనున్నారు. ఇక ఎన్నికల ని ర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది వివరాలను Te-poll సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఎన్నికల సంఘం సూచించింది. కాగా, ఇ ప్పటి వరకు గ్రామ పంచాయతీల వారీగా అమలు లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను ఎన్నికల సంఘం జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించింది. ఈ ఎన్నికలకు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూర్పు చేసిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీ సుకోనున్నారు. ఈ జాబితాను గ్రామపంచాయతీ, వార్డుల వారీగా విభజించాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన జాబితాలో అభ్యంతరాలు స్వీకరించి, ఓటర్ల తుది జాబితాను ప్రకటించడం చేపడతారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు నెల రోజుల సమయం పడుతుంది.
అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించగా పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఒకే రోజు పోలింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించేలా ఈసీ నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బ్యాలెట్ పెట్టెలపై అతికించాల్సిన పేపర్ సీల్స్, అడ్రస్ ట్యాగ్స్ ముద్రణకు చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. కాగా ఈ ఎన్నికల నిర్వహణపై సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. దీనివల్ల గత ప్రభుత్వం 2019లో తీసుకొచ్చి అమలు చేసిన పంచాయతీ రిజర్వేషన్ల అమలు ఉంటుందా, లేదోననే అంశం తెరపైకి వస్తోంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుండటంతో గ్రామాల్లో మరోమారు రాజకీయ వేడి రగులనున్నది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన స్థానిక నాయకులు ఈ ఎన్నికల్లో గ్రామాల్లో తమ పట్టును నిరూపించుకోనున్నారు.
మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలకు ఏర్పాట్లు..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు జిల్లాలోని 461 పంచాయతీల రిజర్వేషన్ల వివరాలు పంపించాం. ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ బూత్లు, సిబ్బంది నియామకం నెలాఖరులోగా పూర్తి చేస్తాం. గత 2019లో ఏర్పడిన పంచాయతీ పాలకవర్గాల గడువు జనవరి 31తో ముగియనున్నది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకుంటున్నది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయంతో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
-కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్
జిల్లా గ్రామపంచాయతీలు