మహబూబ్నగర్, డిసెంబర్ 8 : మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో గురువారం మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడారు. మహబూబ్నగర్ పట్టణంలో జంక్షన్ల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్లాటర్హౌస్, కళాభారతి తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే మెప్మా కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలని సూ చించారు. కోర్టు కేసులపై అధికారులు పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. అనంతరం భూత్పూర్, బాదేపల్లి మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులపై సమీక్షించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్కుమార్, నూరుల్ నజీబ్, మహమూద్ షేక్ తదితరులు ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
హన్వాడ, డిసెంబర్ 8 : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. హన్వాడ తాసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించడంతోపాటు అధికారులు, ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యగౌడ్, డాక్టర్ ప్రీతి, హెచ్ఎం భాస్కర్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.