మహబూబ్నగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇసుక బంగారమైంది. సామాన్యులకు దొరకడం గగనమైంది. ఉమ్మడి జిల్లాలో కొరత ఏర్పడడంతో గృహ నిర్మాణదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా జిల్లాల్లో ఇసుక రీచ్లు ఉన్నా అధికార పా ర్టీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే నిలిపివేశారు. మరోవై పు కల్వకుర్తిలో అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అడ్డగోలుగా రవాణా చేస్తుండడంతో దుందుభీతోపాటు, వాగుల పరీవాహక ప్రాం తాల్లోని పొలాల రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఇసుక రీచ్లకు అనుమతి ఇచ్చినా ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారయంత్రాంగం విఫలమైంది. దీంతో ఇసుక కాంట్రాక్టర్లు ప్రైవేట్ పేరిట బుకింగ్ చేసుకొని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇసుక దొరక్క చాలామంది నిర్మాణాలు నిలిపివేసుకున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గృహ నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. బ్లాక్ మార్కెట్లో ఇసుక ట్రాక్టర్ రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పలుకుతున్నది. ఒక టిప్పర్ మాత్రం రూ.30 వేలకు చేరింది. గృహ నిర్మాణ రంగంలో తక్కువ ధరకు దొరికే ఇసుక కాంట్రాక్టర్లు, అధికారులు, అధికార పార్టీ నేతల కారణంగా ధరలు చుక్కలనంటాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నే తల అండదండలతో చాలా జిల్లాల్లో రాత్రికి రాత్రే ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నా రు. మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక కొరతను దృ ష్టిలో ఉంచుకొని కొంతమంది నకిలీ వ్యాపారులు కృత్రి మ ఇసుకను తయారుచేసి జనాల నెత్తి మీద కుచ్చుటోపీ పెడుతున్నారు.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఇసుక నిల్వలు అవసరానికి సరిపడా ఉన్నాయి. అయితే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలతో అధికారులను బెదిరించి ఇసుక రీచ్లను నిలిపివేశారు. టీఎస్ఎంఐడీసీతోపాటు ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఇసుక బుకింగ్ను ఏర్పాటు చేశారు. వీటి కింద ఇసుక అమ్మితే లాభం ఏమిటని అనుకున్న మాఫియాతో అధికార పార్టీ నేతలు కుమ్ముకై ఎక్కడికక్కడే రీచ్లను నిలిపివేశారు. దీంతో రూ.1500కు టన్ను దొరకాల్సిన ఇసుక రూ.3 వేల నుంచి రూ.4 వేలకు చేరింది. నిర్మాణ రంగంలో ప్రధానంగా దొరికే ఇసుకకు కృత్రిమ కొరతను సృష్టించి మాఫియా రూ.లక్షలు ఆర్జిస్తున్నది. మరోవైపు దేవరకద్ర, మక్తల్, పాలమూరు, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన హస్తం పార్టీ నేతలు రాత్రిళ్లు యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. పోలీస్, అధికారులు రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మైనింగ్ శాఖ చేతులెత్తేసింది. ఇప్పటికైనా ఆయా జిల్లా కలెక్టర్లు మేల్కొని ఇసుకను తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలని సామాన్యులు కోరుతున్నారు.
ఐదు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఇసుక ఇబ్బడి, ముబ్బడిగా లభ్యమవుతుంది. కానీ ఈ ఇసుకను ప్రజలకు చౌకగా అందించాల్సిన అధికారులు ఇసుక మాఫియాతో కుమ్మక్కై ధరలు పెంచడానికి కారణమవుతున్నారు. నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ మే మన ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిం ది. ఇసుక కావాల్సిన వారు నేరుగా ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్లి బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలామం ది ఇసుక మాఫియాకు చెందిన కాంట్రాక్టర్లు బుకింగ్ చేసుకొని ఇసుకను బ్లాక్లో అమ్ముతున్నారు. వనపర్తిలో కూడా ఇసుక రీచ్ను ఏర్పాటు చేసి ఆన్లైన్ అందుబాటులోకి తీసుకొచ్చినా సామాన్యులకు మా త్రం దొరకడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.