రాజోళి, జనవరి 30 : మండల కేంద్రంలో సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంపు రాత్రికి రాత్రే మాయమైంది. స్థానికులు ఇసుక అక్రమ రవాణాపై సోమవారం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని 24 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేసి పంచనామా చేశారు. అయితే సీజ్ చేసిన ఇసుకను సోమవారం రాత్రి మినీ టిప్పర్లతో అక్రమార్కులు తరలించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇసుక అక్రమార్కులకు అధికారులు అండగా ఉండడంతోనే ఈ పని జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విచారణ నిర్వహించాల ని కోరుతున్నారు.
సీజ్ చేసిన ఇసుక తరలింపుపై తాసీల్దార్ శ్రీనివాస్శర్మను వివరణ కోరగా సిబ్బంది లేక పోవడంతో డంపులకు భద్రత కల్పించలేక పోయామ ని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేసేందుకు లెటర్ రెడీ చేసి జిల్లా అధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఇసుక అక్రమార్కులు అధికారుల అండదండలతో చెలరేగి పోతున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.