కలెక్టర్ వెంకట్రావు
విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి1: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మహబూబ్నగర్ జిల్లా శాఖ నూతన సంవత్సరంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా కృషిచేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం ఎనుగొండలోని రెడ్క్రాస్ అనాథ శరణాలయాన్ని సందర్శించారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా రూ.80వేల విలువైన వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, స్కూల్ బ్యాగులు, క్యారీ బ్యాగ్లను పంపిణీ చేశారు. రెడ్క్రాస్ ద్వారా విద్యా నిధిని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు సహకారం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున విద్యానిధికి రూ.5 లక్షల ఇచ్చామని, విద్యానిధిని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇండియన్ రెడ్క్రాస్కు తనవంతు సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి ఒక కార్యకర్తగా పని చేస్తానని, రెడ్క్రాస్ తరఫున ఎలాంటి కార్యక్రమం చేపట్టినా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఇటీవల మెడికల్ సీటు సాధించిన ముగ్గురు విద్యార్థులకు పూలమొక్కలు అందజేసి సన్మానించారు. మహబూబ్నగర్లో విద్యనభ్యసించి పీహెచ్డీ చేసి వికలాంగుల సాహిత్యం, సామాజిక చైతన్యం పుస్తకం రాసిన హరీశను సన్మానించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు లయన్ నటరాజ్, డాక్టర్ శామ్యూల్, ట్రెజరర్ జగపతిరావు, డాక్టర్ విష్ణు జనార్దన్, రమణయ్య, వీరేశం, రామచంద్రుడు, అశ్విని చంద్రశేఖర్ పాల్గొన్నారు.