మిట్ట ప్రాంతాలకూ సాగునీరు అందనున్నది. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా సమీపంలో నిర్మిస్తున్న లిఫ్ట్ బీడు భూములకు వరంగా మారనున్నది. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎత్తిపోతలను మంజూరు చేయించారు. రూ.61.74 కోట్లు కేటాయించగా.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. బ్రాంచ్ కెనాల్ 7.5 కిలోమీటర్ వద్ద ఆఫ్ టేక్ తీసుకొని అక్కడి నుంచి కిలోమీటరున్నర వద్ద అప్రోచ్ కెనాల్, పంపుహౌస్తోపాటు రెండు మోటర్లు, పైప్లైన్, 2.5 ప్రెషర్లైన్, వాటర్ డెలివరీ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మూడు కెనాల్స్ నిర్మించనున్నారు. 43.25 క్యూసెక్కుల నీటిని వినియోగించేలా టార్గెట్ నిర్ణయించారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తవగా.. మిగతావి త్వరగా పూర్తి చేసి ఎత్తయిన ప్రాంతంలోని 4,325 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రణాళికతో అధికారులు అడుగులు వేస్తున్నారు. దీంతో త్వరలో బీడుభూముల్లో కృష్ణమ్మ పరుగులు పెట్టి జలకళ సంతరించుకోనున్నది.
– వనపర్తి, ఏప్రిల్ 8
వనపర్తి, ఏప్రిల్ 8 : సాగునీరు లేక పంటపొలాలు బీళ్లుగా మారిన గ్రామ పంచాయతీలు, తండాలకు కర్నె తండా లిఫ్ట్ వరంలా మారనున్నది. ఖిల్లాఘణపురం మండలంలో బీటలు వారిన పొలాలను చూసి.. కుటుంబపోషణ భారమై ప్రజలు వలసలు వెళ్లేవారు. రైతన్నల బాధలను గుర్తించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి.. ఎంజీకేఎల్ఐ బ్రాంచ్ కెనాల్ ద్వారా గణపసముద్రాన్ని నిండుకుండలా మార్చారు. దాని కింద ఉన్న చెరువులను గొలుసుకట్టు ద్వారా నింపారు. అయితే ఖిల్లాఘణపురం మండలకేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో మిట్ట ప్రాంతంలో ఉన్న కర్నెతండా, చుట్టుపక్కల ఉన్న తండావాసులు మాత్రం సాగునీటికి నోచుకోలేకపోయారు.
ఈ క్రమంలో కర్నెతండాకు వచ్చిన మంత్రి నిరంజన్రెడ్డికి స్థానికులు తమ బాధలను చెప్పుకొన్నారు. సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వ్యవసాయం చేసుకుంటామని వివరించారు. ఎత్తులో ఉన్న ప్రాంతాలకు సాగునీటిని ఎలా అందించాలని అధికారులతో చర్చించారు. లిఫ్ట్ ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని గ్రహించి.. సీఎం కేసీఆర్తో చర్చించి కేవలం ఆరు నెలల్లోనే కర్ణెతండా లిఫ్ట్ మంజూరు చేయించారు. మార్చి 3, 2022న రూ.61.74 కోట్లతో పనులను ప్రారంభించగా.. 50 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ లిఫ్ట్ ద్వారా పలు గ్రామాలు, తండాలతోపాటు దాదాపుగా 20 కుంటలకు సాగునీరందనున్నది.
కర్నెతండా స్వరూపం..
మంగనూర్ నుంచి ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా గణపసముద్రాన్ని నింపారు. అయితే, ఈ బ్రాంచ్ కెనాల్ 7.5 కిలోమీటర్ వద్ద ఆఫ్ టేక్ తీసుకొని.. అక్కడి నుంచి కిలోమీటరున్నర వద్ద అప్రోచ్ కెనాల్, పంపుహౌస్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రెండు మోటర్లు, పైప్లైన్, 2.5 ప్రెషర్ లైన్, వాటర్ డెలీవరీని నిర్మించనున్నారు. ఈ లిఫ్ట్ పనులు పూర్తయితే మిట్ట ప్రాంతంలోని 4,325 ఎకరాలకు 43.25 క్యూసెక్కులను అందించొచ్చు. లిఫ్ట్ పనుల్లో అప్రోచ్ కెనాల్, పంప్హౌస్లు పనులు పూర్తి కాగా.., మోటార్ల ఫిట్టింగ్ పెండింగ్లో ఉన్నది. షాపూర్, లట్టుపల్లి కెనాల్ హెడ్వర్క్ మొత్తం పూర్తయ్యాయి.
కర్నెతండా లిఫ్ట్ కింద మూడు కాల్వల ద్వారా సాగునీటికి అందించనున్నారు.
లట్టుపల్లి కెనాల్ : కర్నెతండా లిఫ్ట్ నుంచి లట్టుపల్లి కెనాల్ను 6.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ కెనాల్ ద్వారా లట్టుపల్లి, భీముని తండా, మిట్ట తండా, ఉశ్యా తండా, చిన్నపీరుతండా, హనుమంతు తండా, కాట్రావత్ తండాలకు సాగునీరందనున్నది.
షాపూర్ కెనాల్ : షాపూర్ కాల్వను 4.9 కిలోమీటర్ల మేర చేపడుతున్నారు. కర్నెతండా, ఆముదం బండ తండా, గార్లబండ తండా, మామిడిమాడ తండా, షాపూర్ తండాలకు సాగునీరందనున్నది.
జంగమాయపల్లి కెనాల్ : జంగమాయపల్లి కెనాల్ను 3 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నా రు. ఈ కాల్వ ద్వారా జంగమాయపల్లి, బలిజపల్లి, ముందరి తండా, పామిరెడ్డిపల్లి, చీకరిచెట్టు తండా, వీరాయపల్లి, కోతులకుంట తండా, దొంతికుంటతండా, రుక్కన్నపల్లి, కుంట ముందరి తండాలకు సాగునీరందనున్నది.
ఎత్తు ప్రాంతాలకు వరం..
ఎత్తు ప్రాంతాల్లో ఉ న్న ప్రజలకు కర్నెతం డా లిఫ్ట్ వరంలా మారనున్నది. కర్నెతండాకు లట్టుపల్లి కాల్వ ద్వారా సాగునీరందుతుంది. కర్నెతండాకు నీరు వ స్తుందని ఎప్పుడూ అ నుకోలేదు. తుల్జాభవా ని అమ్మవారి దర్శనాని కి వచ్చిన మంత్రి నిరంజన్రెడ్డిని గిరిజనులందరూ కలిసి సాగునీరు అం దించాలని కోరారు. ఆ హామీ మేరకు ఆరు నెలల్లో లిఫ్ట్ మంజూరు చేసి.. పనులను ప్రారంభించారు.
– కృష్ణానాయక్, ఎంపీపీ, ఖిల్లాఘణపురం
చాలా సంతోషంగా ఉన్నది..
కర్నెతండా.. ఖిల్లాఘణపురం మండలానికి 11 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో ఉంటుంది. సాగునీరు లేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మంత్రి నిరంజన్రెడ్డి కర్ణెతండాపై ప్రత్యేక దృష్టి సారించి లిఫ్ట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది. మా తండాతో పాటు చుటుపక్కన ఉన్న చాలా తండాలకు సాగునీరందుతుంది. మా కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి
నిరంజన్రెడ్డిలకు కృతజ్ఞతలు.
– శాంతి, సర్పంచ్, కర్నెతండా