నారాయణపేట టౌన్, డిసెంబర్ 2: డిసెంబర్ 3,4 తేదీల్లో ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీసీద్వారా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. వీసీలో పాల్గొన్న కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి పోలింగ్స్టేషన్లో రెండు రోజులపాటు ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటుకు ఆదేశించామన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు బీఎల్వోలు గరుడ యాప్లో నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీఎల్వోలు గైర్హాజరైతే చర్యలు తీసుకునేలా తాసిల్దార్లను ఆదేశించామన్నారు. ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసినందున అందులో మార్పులు, చేర్పులు చేసుకోదగిన ఓటర్లు ప్రత్యేక క్యాంపెయిన్ను సద్వినియోగం చేసుకునేలా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్రావు, తాసిల్దార్ దానయ్య తదితరులు పాల్గొన్నారు.
2023 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండేవారు, ఇప్పటికే 18 ఏండ్లు పూర్తయిన యువత, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ప్రత్యేక క్యాంపెయిన్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతనెల 26, 27 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించామని, అదేవిధంగా ఈనెల 3, 4 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్వోలు ఓటరు నమోదు ప్రక్రియను చేపడుతారని తెలిపారు. ఓటర్లు వయసు నిర్ధారణ ధ్రువీకరణపత్రాలు, ఆధార్, ఫొటో వంటివి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఫారం 6ను పూర్తి చేసి బీఎల్వోకు అందజేయాలన్నారు. ఈ రెండు రోజుల్లో ఉదయం 10నుంచి 5గంటల వరకు బీఎల్వోలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారాకూడాఓటు నమోదు చేసుకోవచ్చన్నారు.