ఆత్మకూరు/దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), నవంబర్ 17 : కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన ఘట్టం అలంకారోత్సవానికి వేదికైన ఆత్మకూరు పట్టణం శోభాయమానంగా ముస్తాబైంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అలంకారోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక ఎస్బీఐలో భద్రపరిచిన స్వామివారి స్వర్ణాభరణాలను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేర్చడమే అలంకార మహోత్సవం. ఆత్మకూరు సంస్థానాధీశులైన ముక్కెర వంశ రాజులు కురుమూర్తిస్వామి, లక్ష్మీదేవిలకు చేయించిన ఆభరణాలు బ్యాంకులో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు నిర్వహించనున్నారు. అనాదిగా వస్తున్న స్వర్ణాభరణాల ఊరేగింపు పట్టణానికి చెందిన గాడి వంశస్తుల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. గాడి వంశస్తుడైన స్వర్ణకార సహకార సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, సేవా అవార్డు గ్రహీత, శృతి జ్యువెల్లర్స్ అధినేత గాడి లక్ష్మీనారాయణ ఈ ఏడాది స్వర్ణాభరణాలను తలపై పెట్టుకొని ఊరేగించనున్నారు. సీఐ కేఎస్ రత్నం, ఎస్సై శ్రీహరి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అలంకార మహోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానున్నారు.
అమరచింత, నవంబర్ 17 : కొలిచిన వారికి కొంగు బంగారంగా, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు పేదల తిరుపతిగా పిలుచుకుంటున్న కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవానికి పట్టువస్ర్తాలను సిద్ధం చేశామని చేనేత కార్మికుడు దేవరకొండ లచ్చన్న తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే పట్టణంలోని భక్తమార్కండేయస్వామి ఆలయంలో ప్రత్యేకంగా మగ్గంను తయారు చేసుకుని కురుమూర్తిస్వామి పట్టువస్ర్తాలను నియమనిష్టలతో, ఉపవాసలతో నేయడం జరిగిందన్నారు. శుక్రవారం పట్టువస్ర్తాల పనులను పూర్తి చేసి శనివారం వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కురుమూర్తిస్వామి సన్నిధికి తరలిస్తామన్నారు.