అయిజ, డిసెంబర్ 2: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి, ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో చేపట్టే పనుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా చేపట్టారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు అవసరమైన పనులు ఎంపిక చేసుకునేందుకు గ్రామసభలను అధికార యంత్రాంగం నిర్వహిస్తున్నది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏటా పనులను గుర్తించడం ఆనవాయితీ. రాష్ట్ర ప్రభు త్వం ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించి నిధులు విడుదల చేస్తున్నది.
మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనుల గుర్తింపునకు గ్రామసభలను నిర్వహిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏఏ పనులు చేపట్టాలో సభలలో తీర్మానం చేస్తున్నారు. సర్పంచ్, ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్, కార్యదర్శి, ఉపాధిహామీ సిబ్బంది, కూలీలు గ్రామసభలో పాల్గొని పనులు గుర్తిస్తున్నారు. గ్రామసభలు తీర్మానించిన పనులకే ప్రాధాన్యత ఉండటంతో గ్రామసభలు అత్యంత కీలకం కానున్నాయి. జాబ్ కార్డులు ఉన్న ప్రతిఒక్కరికీ 100రోజులు పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ నిధులు దక్కాలంటే గ్రామసభలో గుర్తించిన పనులే కీలకం కానున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సభల్లో కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారు. గ్రామాభివృద్ధి వ్యక్తిగత పనులతోపాటు రైతులు పంట పొలాల్లో అవసరమైన వాటిని గుర్తించవచ్చు. గ్రామసభల ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉంటుంది.
ఉపాధి హామీ పథకం కింద అత్యవసర పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రధానంగా పంటపొలాల్లో నీటి కుంటలు, కందకాల తవ్వకం, పూడికతీత, పశువులపాకలు, కల్లాల నిర్మాణం, పశుగ్రాసం పెంపకం, పండ్లతోటలు, గట్టపై టేకు చెట్ల పెంపకం, వర్షపునీటి మళ్లింపు కాల్వలు, బంజరు భూములను సాగుకు యోగ్యంగా మార్చడం, రహదారులు, మట్టిరోడ్లు, శ్మశానవాటికల అభివృద్ధి తదితర పనులు చేపట్టనున్నారు. నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్వహణ, చెరువుల నిర్మాణం పనులను గ్రామసభలో ఆమోదిస్తున్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2023-24 ఏడాదికి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు 100రోజులు పనికల్పించేందకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తిస్తున్నాం. పనులు గుర్తించి అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఈ నెల చివరి నాటికి గ్రామసభలను పూర్తిచేసి జిల్లా అధికారులకు నివేదికలను పంపుతాం.
– సాయిప్రకాశ్, ఎంపీడీవో, అయిజ