గోపాల్పేట, ఏప్రిల్ 12 : చేతికొచ్చిన పంట సాగునీరు లేక కండ్లముందే ఎండిపోతున్నది. చేసిన కష్టమంతా చేజారిపోతున్నా చేసేదేమీలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో ఎండిన వరి పంటను గొర్లకు మేతగా ఇస్తు న్నారు. గోపాల్పేట మండలం ఎర్రగట్టు తండాకు చెందిన రైతు లావూడ్యా భాస్కర్ తనకున్న రెండు బోర్లతో యాసంగిలో మూడెకరాల్లో వరి పంట సాగు చేశాడు. పంట చేతికొచ్చే దశలో బోర్లలో నీళ్లు పూర్తిగా తగ్గడంతో పంట క్రమంగా ఎండుతూ వస్తోంది. ఇప్పటికే సగం పంట ఎండిపోగా మిగిలిన పంటను కాపాడుకునేందుకు భాస్కర్ నానా తంటాలు పడు తున్నాడు. మూడెకరాల్లో ఎకరం పంట ఎండిపోగా గొర్ల మేతకు వదిలేశాడు. రెండెకరాలకు కూడా బోర్ల నుంచి వస్తున్న నీళ్లు సరిపోవని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎకరం వరి సాగుకు రూ.25వేల వరకు ఖర్చు అయిందని, చేసిన కష్టం పోను, పెట్టుబడి కూడా మీద పడుతుందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని సదరు రైతు కోరుతున్నాడు.