గద్వాల, మే 15 : మారుతున్న సమాజానికి అనుగుణంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కొన్ని ప్రాంతాల్లో కులాలు, మతాలనీ కట్టుబాట్లతో కొనసాగుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అందుకు భిన్నంగా కులాంతర వివాహాలు చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి వారికి ఆర్థికంగా చేయూతనిస్తున్నది. రూ.2.50లక్షలకు ప్రోత్సాహకాన్ని పెంచుతూ 2019 అక్టోబర్లో నిర్ణయం తీసుకున్నది. ఆ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
యువత సమాజంలోని అంతరాలను తగ్గించడానికి కులాంతర వివాహాలు దోహాదం చేస్తాయి. ప్రభుత్వం అండతో యువత సైతం ముందుకొస్తుండగా.. కొన్నిచోట్ల మాత్రం కులం కట్టుబాట్లతో వెనుకడుగు వేస్తున్నారు. సాధారణంగా కులాంతర వివాహాలు చేసుకున్న యువత ఎక్కువగా తల్లిదండ్రులు, బంధువులను ఎదిరించి బయటకొస్తున్నారు. దీంతో పెండ్లి తర్వాత వారికి ఆదరణ లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలువురు కులాంతర వివాహాలు చేసుకునేందుకు జంకుతున్నారు. పట్టణాల్లో వివాహం చేసుకున్న వారికి ఎక్కువ ఇబ్బందులు లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇబ్బందిగా ఉండేది. ఉద్యోగం లేనివారు స్వయం ఉపాధి కోసం ఇతరులు లేదా స్నేహితులపై ఆధారపడాల్సి వచ్చేది. గతంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు సరిపోక కులాంతర వివాహాలు చేసుకున్న వారు ఇబ్బంది పడేవారు. ఈ సహాయాన్ని పెంచాలని కులాంతర వివాహాలు చేసుకున్న వారు కోరగా ప్రభుత్వం గతంలో ఇస్తున్న దాని కంటే ఐదురెట్లు పెంచి అందిస్తున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహకం రూ.2.50లక్షలు
గతంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.50వేలు ఇచ్చేది. ఈ నగదు సరిపోక వారు కొంతమేర ఇబ్బందులు పడేవారు. కులాంతర వివాహాలకు ఇస్తున్న ప్రోత్సాహకం కంటే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఎక్కువ నగదు వస్తుండడంతో యువత అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి అందిస్తున్న ప్రోత్సాహకాన్ని ఇప్పుడు రూ.2.50లక్షలకు పెంచింది. వేరు వేరు కులాలకు చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకుంటేనే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతోపాటు రిజర్వేషన్లు కల్పిస్తే సమాజంలో కులం, మతం అంతరాలను తొలగించేందుకు తోడ్పాటు లభించనున్నది.
ఇప్పటివరకు 35 మందికి లబ్ధి
జోగులాంబ గద్వాల జిల్లాలో 2016 నుంచి ఇప్పటివరకు 35 జంటలు కులాంతర వివాహం చేసుకున్నారు. 2016-17లో 11మంది, 2017-18లో ఐదుగురు, 2018-19లో నలుగురికి రూ.50వేలు అందించారు. 2019 నుంచి వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.2.50లక్షలు అందిస్తోంది. 2019-20లో ఐదుగురు, 2021-22లో ఏడుగురు, 2022-2023లో ముగ్గురు కులాంతర వివాహం చేసుకోగా వీరందరికీ ప్రభుత్వం రూ.2.50లక్షల చొప్పున అందజేసింది.
ప్రోత్సాహకం పొందాలంటే..
కులాంతర వివాహం చేసుకున్న వారు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని పొందాలంటే ఈ ధ్రువపత్రాలు దరఖాస్తు ఫారానికి జతపర్చాలి. వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయం జోగులాంబ గద్వాల జిల్లాకు దరఖాస్తు చేసుకోవాలి. వారి పెండ్లి ఆధారాలను బట్టి అధికారులు విచారణ చేసి ప్రోత్సాహకాన్ని అందిస్తారు. దరఖాస్తు ఫారానికి వివాహం చేసుకున్న జంట ఫొటోలు, తాసీల్దార్ ధ్రువీకరణ చేసిన ఇద్దరి కులాల పత్రాలు, విద్యాసంస్థలు ఇచ్చిన వయస్సు ధ్రువీకరణ, వివాహం చేయించిన అధికారి ద్వారా పొందిన ధ్రువీకరణతోపాటు గెజిటెడ్ అధికారి నుంచి పొందిన మొదటి పెండ్లి సర్టిఫికెట్తో ఆ జంట తీసిన బ్యాంక్ఖాతా వివరాలు, ఆదాయ ధ్రువీకరణతోపాటు ఆధార్, రేషన్ కార్డులు జతపర్చి ఎస్సీ సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలి.