పెబ్బేరు, జూన్ 25 : ఆలయాల్లో పూజారులుగా కొనసాగుతున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సర్కారు అమలు చేస్తున్న ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ఉమ్మడి జిల్లాలో మరో 339 ఆలయాలకు వర్తింపజేస్తూ ఇటీవలే ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా ఆయా ఆలయాలకు సంబంధించిన అర్చకులకు పత్రాలను కూడా అందజేశారు. ఆదాయం లేక ధూపం, దీపానికి కూడా నోచుకోని ఆలయాలకు ఆర్థిక చేదోడును ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యం పథకాన్ని అమలు చేస్తున్నది. కేవలం భక్తుల కానుకల పైనే ఆధారపడి చాలీచాలని ఆదాయంతో కొట్టుమిట్టాడుతున్న అర్చకుల కుటుంబాలకు పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం ఉమ్మడి జిల్లాలో అమలులో ఉన్నప్పటికీ, తాజాగా మరిన్ని ఆలయాలకు పథకాన్ని వర్తింపజేశారు.
హైదరాబాద్లో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా మే 31వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు బ్రాహ్మణులకు వరాల జల్లు కురిపించారు. మరిన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఈ పథకం కింద ఇస్తున్న రూ.6వేలను రూ.10వేలకు పెంచుతున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ధూప దీప నైవేద్యం పథకాన్ని మరిన్ని ఆలయాలకు వర్తింప జేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేసీఆర్ ప్రకటించిన 20 రోజులకే అర్చకుల పేరుమీద వచ్చిన ప్రొసీడింగ్ కాపీలను ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు.
ధూప దీప నైవేద్యం పథకం కింద పెబ్బేరు మండలం పాతపల్లి సమీపంలోని చింతలకుంట ఆంజనేస్వామి ఆలయం ఎంపి క కావడం హర్షించదగిన విషయం. చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్న అర్చకుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నది. పూజారుల కుటుంబాలకు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించింది. దాతల కోసం ఎదురుచూపులు తప్పాయి.
– వెంకటేశ్వర్లు, పాతపల్లి ఆంజనేయస్వామి ఆలయ పూజారి, పెబ్బేరు మండలం
ధూప దీప నైవేద్యం పథకం కింద అర్చకులకు ఇస్తున్న వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచడం సంతోషదాయకం. వేతనం పెంపును సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ పథకం కింద రూ.2,500 అందేవి. కేసీఆర్ సీఎం అయ్యాక 2014 నుంచి రూ.6వేలకు పెంచారు. ఇప్పుడు రూ.10వేలకు పెంచడంతో బ్రాహ్మణుల జీవితాలకు భరోసా కలిగించినట్లయ్యింది.
– పీవీ లక్ష్మీకాంతాచార్యులు, ధూప దీప నైవేద్య సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు