మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 21 : అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని, రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అడ్డాకులలోని మాతృశ్రీ పాఠశాలలో అడ్డాకుల, మూసాపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఉచిత కరెంట్, సా గు, తాగునీరు, రైతుబంధు, పింఛన్లు, రైతుబీమా, గొర్రెలు, బర్రెలు ఇలా అన్నీ అడగక ముందు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదన్నారు. 120 కాంగ్రెస్ పాలనలో అన్నీ పోయి మళ్ల్లీ 2014కు ముందు రోజులు వచ్చాయన్నారు. ఇప్పుడున్న ఎంపీ స్థానాన్ని కూడా వదులుకుంటే కాంగ్రెస్ పార్టీని అడిగేటోడు ఉండడు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే వారు ఇచ్చిన హామీల మాట దేవుడెరుగు కనీసం కేసీఆర్ అమలు చేసిన పథకాలనైనా కొనసాగిస్తారా అనే అనుమానం వస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా రైతు రుణమాఫీ ,అవ్వ, తాతలకు, రూ.4వేల పింఛన్ , కుటుంబ పెద్ద, కోడలికి రూ.2500, రైతుబంధు రూ.15వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించుకోవాలి బీఆర్ఎస్ హయాంలో మీకు ఏం కావాలన్నా ముందు నిలబడి కేసీఆర్తో మాట్లాడి ఇప్పించేటోళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
గారడి మాటలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. ఈ అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అమలు కాని హామీలు, అబద్ధపు ప్రచారం చేస్తుంటే మన పార్టీ శ్రేణులు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్లనే ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపుకోసం మనం చేయాల్సిందల్లా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మ్యానిఫెస్టోను తీసుకొని వారు చెప్పిన హామీలు ప్రజలకు ఎన్ని అందాయి. అందితే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి. అందకుంటే కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం ఎంపీ ఎన్నికల ఇన్చార్జి పల్లెరవికుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదిజలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తే.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేస్తూ కృష్ణా, గోదావరి నదీ జలాలను ఇతర రాష్ర్టాలకు తరలించాలని కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిస్తే అన్ని వర్గాలలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మళ్లీ అట్టడుగు స్థాయికి వెళ్లక తప్పదన్నారు. అందుకని ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మనకు బతుకుదెరువు ఉంటుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ తరఫున పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కేవలం మహిళలకు బస్సుల్లో ప్రయాణం మాత్రం అమలు చేశారు. ఉచితం పేరుతో భార్యాభర్తలు, తండ్రీ కూతురు, అన్నాచెల్లెల్లను విడదీస్త్తున్నట్లు ఉంది. బస్సుల్లో ప్రశాంతంగా సాగాల్సిన మహిళల ప్రయాణంలో ప్రతి రోజూ కొట్టుకునే పరిస్థితి దాపురించింది. మంచి చేసే కేసీఆర్ పార్టీని గెలిపించుకోవాలో లేదో ప్రజలే ఆలోచించుకోవాలి. మనకు అధికారం ఉంటే మీ తరఫున నిలబడానికి నేను ఎప్పటికీ ముందు వరుసలో ఉంటాను. కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కారు గుర్తుకు ఓట్లు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలి.