జడ్చర్లటౌన్, డిసెంబర్ 21: చిన్నప్పటి నుంచే క్రీడలపై ఉన్న ఆసక్తితో రోయింగ్ క్రీడను ఎంచుకొని జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటుతున్నాడు జడ్చర్లకు చెందిన జ్ఞానేశ్వర్. పట్టణంలోని శివాజీనగర్కు చెందిన శ్రీనివాసులు, లక్ష్మి కుమారుడు జ్ఞానేశ్వర్ తండ్రి మృతిచెందగా, తల్లి కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నది. పేద కుటుంబంలో పుట్టిన జ్ఞానేశ్వర్కు చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఇష్టం. క్రీడలపై ఆసక్తి, పట్టుదలను గుర్తించిన తల్లిదండ్రులు జ్ఞానేశ్వర్కు హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ పాఠశాలలో నాలుగో తరగతిలో చేర్పించారు. అప్పటినుంచి అక్కడే విద్యనభ్యసిస్తున్న జ్ఞానేశ్వర్ చదువుతోపాటు రోయింగ్ క్రీడపై పట్టుసాధించాడు.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ హెచ్ఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో శాట్స్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 13నుంచి 17వ తేదీవరకు జరిగిన జాతీయ జూనియర్ రోయింగ్ చాంపియన్షిప్ పోటీల్లో మెన్స్ సీ-8 విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
అదేవిధంగా రాష్ట్రస్థాయి సింగిల్స్ విభాగం పోటీలో బంగారు పతకం సాధించి చాంపియన్షిప్ను దక్కించుకున్నాడు. అలాగే మెన్స్ సీ-4 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6నుంచి 12వ తేదీవరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరగనున్న ఖేలో ఇండియా రోయింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ, రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో సత్తాచాటుతున్న జ్ఞానేశ్వర్ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన జ్ఞానేశ్వర్కు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగే అవకాశం లభిస్తోందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ఒలింపిక్స్లో మెడల్ సాధించడమే లక్ష్యం
చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. హైదరాబాద్లోని స్పోర్ట్స్ పాఠశాలలో చేరి రోయింగ్ క్రీడను ఎంచుకున్నాను. రోయింగ్ క్రీడలో రాణించేందుకు కోచ్ ఇస్మాయిల్బేగ్, సతీశ్జోషి శిక్షణ ఇచ్చారు. స్పోర్ట్స్ పాఠశాల ఓఎస్డీ డాక్టర్ హరికృష్ణ ప్రోత్సాహంతోనే జాతీయ, రాష్ట్రస్థాయి రోయింగ్ చాంపియన్షిప్ పోటీల్లో రాణించగలిగాను. భవిష్యత్లో ఒలింపిక్స్లో పాల్గొని ఇండియా తరఫున మెడల్ సాధించాలన్నదే లక్ష్యం. నిత్యం ఉదయం 6నుంచి 9:30గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6గంటల వరకు ప్రాక్టీస్ చేస్తున్నాను. మధ్యప్రదేశ్లో జరగనున్న ఖేలో ఇండియా పోటీల్లోనూ మెడల్స్ సాధించేలా కృషి చేస్తున్నాను.
– జ్ఞానేశ్వర్, క్రీడాకారుడు, జడ్చర్ల