ట్యాంక్బండ్కు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్.. అచ్చం అలాంటి కట్టడాన్ని తలపిస్తున్నది. నాగర్కర్నూల్ మినీ ట్యాంక్బండ్. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన కేసరి సముద్రం చెరువు తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో అభివృద్ధికి నోచుకున్నది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రత్యేక దృష్టితో మినీ ట్యాంక్బండ్గా రూపాంతరం చెందింది. రూ.25 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. చెరువు మధ్యలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకంగా గుర్తింపు తెచ్చుకున్నది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు.
నాగర్కర్నూల్, జనవరి 6(నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. కాకతీయుల హయాంలో గొలుసుకట్టు చెరువుగా నిర్మాణమైన కేసరి సముద్రం దాదాపు 4వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నది. అలాంటి చెరువు సమైక్య పాలనలో నిరాదరణకు గురైంది. కట్ట ముళ్లచెట్లతో, అంధకారంగా, ఒంటరిగా నడిచే వీలులేకుండా ఉండేది. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో చెరువు రూపురేఖలు మారాయి.
హైదరాబాద్లోని మినీ ట్యాంక్బండ్ను తలపించేలా కేసరి సముద్రం చెరువును ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్తోపాటు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్రావు, ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.25కోట్ల నిధులతో సుందరంగా ముస్తాబు చేశారు. ఎంజీకేఎల్ఐ పూర్తవడంతో ఏడాది పొడవునా చెరువు నిండుకుండలా కళకళళాడుతున్నది. ఆయకట్టు పరిసరాలు పచ్చదనంగా మారాయి. ట్యాంక్బండ్ను చూసేందుకు జిల్లాతో పాటు ఇక్కడి ప్రజల బంధువులు, స్నేహితులు సైతం పట్టణానికి వస్తున్నారు. ముఖ్యంగా దసరా రోజు సాయిబాబా ఆలయం నుంచి ఎండబెట్ల వరకు జనసంద్రంగా మారుతుంది. అలుగుపై ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఆకట్టుకుంటున్నది.
బతుకమ్మ ఘాట్ వద్ద మహిళలు బతుకమ్మలను వదులుతారు. అలాగే ఓపెన్ ఆడిటోరియం, ఓపెన్ జిమ్, లవ్ ఎన్జీకేఎల్ సింబల్, లేజర్ లైటింగ్షో, శమీ వేదిక ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలతో నిండిపోయింది. 110ఫీట్ల భారీ జాతీయ పతాకం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 36అడుగుల బుద్ధ విగ్రహం సైతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. ఇక రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ బల్బులు, పాదచారుల కోసం హైదరాబాద్ ట్యాంక్బండ్ మాదిరిగా గ్రానైట్, నాణ్యతతో కూడిన రోడ్డు నిర్మించారు. కట్టపై రెండు భారీ వాహనాలు ఒకేసారి వెళ్లేంత వెడల్పు చేశారు. ట్యాంక్బండ్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో సందడిగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో కొందరు యువత షార్ట్ఫిలిమ్స్, రీల్స్ పేరిట వీడియాలు చేస్తూ, డ్రోన్ కెమెరాలతో ట్యాంక్బండ్ అందాలను బంధిస్తున్నారు. చెరువు కట్టకు పునాది నుంచి ప్రారంభోత్సవం వరకు ఎమ్మెల్యే మర్రి ప్రత్యేకంగా పర్యవేక్షించి, పనులను పూర్తిచేయించి జిల్లా కేంద్రానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం విశేషం.
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో రూ.25కోట్లతో నాగర్కర్నూల్ కేసరి సముద్రం చెరువుకట్టను హైదరాబాద్ ట్యాంక్బండ్ మాదిరిగా అభివృద్ధి చేశాం. ట్యాంక్బండ్పై అన్ని వసతులు కల్పించడంతో పర్యాటకంగా మారింది. ఉదయం నడక, సాయంత్రం మహిళలు, పిల్లలు కూర్చొని సేదతీరేలా అభివృద్ధి చేశాము. ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది. మంత్రి కేటీఆర్ ట్యాంక్బండ్ను ప్రశంసించడం సంతోషకరం. త్వరలో పూర్తిస్థాయి సామర్థ్యంతో బోటును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాను.
– మర్రి జనార్దన్రెఢ్డి, ఎమ్మెల్యే, నాగర్కర్నూల్