నారాయణపేట టౌన్, ఏప్రిల్ 2: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. రైతు లకు మార్కెట్ యార్డులో వసతుల కల్పన, గిట్టుబాటు ధర లభించడంతో ఇతర యార్డు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన రైతులే కాకుండా దూర ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంట ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో కొన్నేండ్లుగా యార్డుకు అధిక ఆదాయం సమకూరింది. దీంతోపాటు మార్కెట్యార్డు ఆధ్వర్యంలో మరికల్ మండ ల కేంద్రంలో తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి 1శాతం మార్కెట్ ఫీజును వసూలు చేస్తున్నారు. సీజన్ సమయంలో యార్డు సమీపంలో తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి ఫీజును వసూలు చేస్తున్నారు.
ప్రతి సీజన్లో రైతులు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులతో మార్కెట్ యార్డు కిటకిటలాడుతున్నది. నారాయణపేటతో పాటు దామరగిద్ద, మరికల్, ధన్వాడ, ఊట్కూర్ మండలాలు పేట మార్కెట్ యార్డు పరిధిలోకి వస్తాయి. ఆయా మండలాలకు చెందిన రైతులు కంది, వరి, పత్తి, వేరుశనగ, జొన్నలు, పెసలు, చింతపండు, తెల్లకుసుమలు, ఉల్లిగడ్డలు, నల్లకుసుమలు, అలసందలు, ఆముదాలు తదితర పంట ఉత్పత్తులను తీసుకొచ్చి ఈ మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు జరుపుతుంటారు. వానకాలం, యాసంగి సీజన్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధర కల్పించినప్పటికీ మార్కెట్లో ధర ఎక్కువగా రావడం వలన రైతులు తమ వరిధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటారు.
గతంలో జిల్లాలో ఒకే ఒక పత్తి మిల్లు ఉండడంతో పత్తి రైతులు రాయిచూర్, వికారాబాద్ తదితర దూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించేవారు. యార్డు పరిధిలో 4పత్తి మిల్లులు ఏర్పాటు కావడంతో పత్తి రైతులు తాము పండించిన పత్తి ఇక్కడే అమ్మేందుకు అవకాశం ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఇక్కడ అధిక ధర లభిస్తుండడంతో నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నారు. అదేవిధంగా కంది పంటకు ధర ఎక్కువగా లభించడంతో ఆత్మకూర్ తదితర ప్రాంతాల రైతులు తమ పంట ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. వరికి అధిక ధర పలకడం వలన కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నారు.
ధాన్యం విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు యార్డులో అధికారులు అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుస్తున్నారు. రైతుల కోసం తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు నాలుగు కవర్షెడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులకు రాత్రి వేళల్లో బస చేసేందుకు గెస్ట్హౌస్ను అందుబాటులో ఉంచారు.
వ్యవసాయ మార్కెట్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. ప్రతి ఏడాది మార్కెట్ ఆదాయం లక్ష్యాన్ని పెంచుతూనే ఉండగా అంతకు మించి ఆదాయం సమకూరడం గొప్ప విషయం. 2022-23 సంవత్సరానికి సం బంధించి రూ. 3కోట్ల ఆదాయం సమకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించగా రూ. 4కోట్ల30లక్షల ఆదాయం సమకూరింది. అదే విధంగా గడిచిన మూడేండ్ల ఆదాయాలను పరిశీలిస్తే 2019-20లో రూ. కోటీ5లక్షల ఆదాయం సమకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించగా రూ.కోటి23లక్షల ఆదా యం లభించింది. 2020-21లో రూ. కోటి59లక్షల ఆదా యం లక్ష్యంగా పెట్టుకోగా రూ. కోటీ97లక్షల ఆదాయం లభించింది. 2021-22లో రూ. 2కోట్ల28లక్షల లక్ష్యంగా నిర్దేశించగా రూ. 3కోట్ల59లక్షల ఆదాయం లభించింది. అంతేకాకుండా తనిఖీ కేంద్రాల ద్వారా వచ్చిన మార్కెట్ ఫీజును పరిశీలిస్తే 2019-20లో రూ. 27లక్షలు, 2020-21లో రూ. 40లక్షలు, 2021-22లో రూ. 61లక్షలు, 2022-23లో రూ.17లక్షల ఆదాయం లభించింది.
రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్లో యార్డులో విక్ర యిస్తే గిట్టుబాటు ధర దొరుకుతుంది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ నిరం తరం ఉంటుంది కాబట్టి రైతులు తూకాల్లో, ధరల్లో మోసానికి గురైతే అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. దళారులను ఆశ్రయించి మోసపోకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డులోనే విక్రయించి మద్దతు ధరను పొందాలి. ఈ నామ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం.
-చంద్రశేఖర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణపేట