నాగర్కర్నూల్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరుద్యోగుల ఉద్యోగ ఆకాంక్షలను తీర్చేలా ప్రభుత్వం వరుసగా గ్రూప్ పరీక్షలు, ఇతర ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కానుంది. టెట్ మార్కులు టీఆర్టీకి అదనంగా కలిసి వస్తాయి. దీంతో ఇప్పటికే రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటుగా కొత్తగా బీఈడీ, టీటీసీ చదివిన అభ్యర్థులు సైతం టెట్ రాసేందుకు సిద్ధమయ్యారు. బీఈడీ స్కూల్ అసిస్టెంట్(పేపర్-2), టీటీసీ అర్హతతో (పేపర్-1) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధిస్తారు. దీనికోసం ఇప్పటికే కోచింగ్లు పూర్తి చేసుకొని సొంతంగానూ సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షను నిర్వహించనున్నది.
ఏర్పాట్లు చేసిన అధికారులు..
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. ఈ పరీక్షలు రెండు పూటలా జరగనున్నాయి. టీటీసీ అర్హతతో రాసే పేపర్-1 పరీక్ష ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, బీఈడీ అర్హతతో నిర్వహించే పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30గంటల నుంచి సా యంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో పేపర్-1 పరీక్షకు 46,998 అభ్యర్థులు హాజరు కానుండగా, 198 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక పేపర్-2 పరీక్షకు 33,800అభ్యర్థులు హాజరవుతుండగా, 148పరీక్షా కేంద్రాల ను సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు గురువారం మధ్యాహ్నం, శుక్రవారం రోజు సెలవులు ఇచ్చారు. పరీక్షలు సీసీ కెమెరా నిఘా నీడలో పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇక బస్సులు కూడా సకాలంలో నడిపేలా ఆ దేశాలు ఇచ్చారు. పోలీసు బందోబస్తుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకొంటున్నారు.
పరీక్షకు ఏర్పాట్లు చేశాం..
నాగర్కర్నూల్ జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేశాం. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు కలిపి 15వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 64పరీక్షా కేంద్రాలను గుర్తించి, సీసీ కెమెరాలతోపాటు తాగునీరు, విద్యుత్, వైద్యంలాంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష పూర్తయ్యాకే కేంద్రం నుంచి బయటకు రావాలి.
– సీతారామారావు, అదనపు కలెక్టర్, నాగర్కర్నూల్