మక్తల్ టౌన్, మార్చి 27 : వరకట్నం వేధింపులకు పాల్పడిన నిందితుడికి నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పదేండ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ మండలం భూత్పూర్కు చెందిన దళితుడు నరసింహ భూత్పూర్ గ్రామానికి చెందిన నర్సమ్మను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 26-10-2020 తేదీన భార్య నర్సమ్మ కనిపించడం లేదని భర్త నర్సింహులు అత్తకు సమాచారం అందించాడు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో నర్సమ్మ తల్లి మీసాల భీములమ్మ నర్సింహులుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అదనపు కట్నం కోసం అత్తామామ, భర్త కలిసి నర్సమ్మను హత్య చేసి భూ త్పూర్ రిజర్వాయర్లో పడేసినట్లు ఒప్పుకొన్నారు. దీంతో 16 మంది సాక్షులను విచారించి నేరస్తులపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, బుధవారం నేరస్తుడికి న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.20వేల జరిమానా విధిస్తూ తీర్చునిచ్చారు. నేరస్తుడికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.