నెట్వర్క్ మహబూబ్నగర్, మే 3 : ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశాయి. దీంతో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. రానున్న మే మాసంలో ఉష్ణోగ్రతలు 41డిగ్రీలకు చేరుకోనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల్లో పొంచివున్న డీహైడ్రేషన్ ప్రమాదం
డీ హైడ్రేషన్(నిర్జలీకరణ)అంటే శరీరంలోని నీరు ఆవిరైపోవడం. ముఖ్యంగా ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి వ్యాధి నిరోదక శక్తి తక్కువగా ఉండడం వల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్కు గురవుతారని నిలోఫర్ సూపరింటెండెంట్ డా.ఉషారాణి తెలిపారు. ఎక్కువగా ఎండలో తిరగం, వడగాల్పులకు గురవడంతో ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. అంతే కాకుండా వేసవిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుందన్నారు. పిల్లలు ఎండలో తిరగడం వల్ల శరీరంలోని లవణాలు, నీరు వాతావరణంలోని ఉష్ణోగత్రకు ఆవిరైపోతుందని, దీంతో పిల్లలు నీరసించి పోతారన్నారు. పిల్లల్లో ‘హీట్ రెగ్యులేషన్ సిస్టమ్’ తక్కువస్థాయిలో పనిచేయడం వల్ల వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని, అందువల్ల పిల్లలను సాధ్యమైనంత వరకు ఎండల్లో బయటకు తీసుకెళ్లక పోవడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
ప్రాథమిక చికిత్స విధానం..
డీహైడ్రేషన్కు గురైన పిల్లలను వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలి. పిల్లలకు ఓఆర్ఎస్ ద్రవాన్ని కొద్ది కొద్దిగా తాగించాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే ఇంట్లో కాచి, చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, చిటికెడు చెక్కరను కలిపి ఆ ద్రవాన్ని తాగించాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీళ్లు తాగించడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు నియంత్రణ కాకపోతే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి.
ఉదయం నుంచే ఎండ తీవ్రత
ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు భానుడి ప్రతాపానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పిల్లలు డీహైడ్రేషన్, సన్స్ట్రోక్(వడదెబ్బ), హెపటైటిస్ తదితర సమస్యల బారిన పడే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం నుంచే ఎండల తీవ్రత పెరిగి అతినీలలోహిత కిరణాలు వెలువుడుతుండడంతో పిల్లలు డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు నిలోఫర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డీహైడ్రేషన్ ప్రమాదకరం
పిల్లలు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశాలున్నాయి. డీహైడ్రేషన్కు గురై వాంతులు, విరేచనాలుతో బాధపడితే వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాలి. ఎక్కువ శాతం ద్రవ పదార్థాలు ఇవ్వాలి. బయటి ఆహారానికి దూరంగా ఉంచాలి. పిల్లలను బయటకు పంపాల్సి వస్తే ఎండ తగల కుండా తలకు టోపి, లోదా గొడుగుతోపాటు పిల్లలకు కాటన్
దుస్తులు వేయాలి.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ హాస్పిటల్