జయజయహే తెలంగాణ జననీ జయకేతనం..
ముక్కోటి గొంతుకలు.. ఒక్కటైన చేతనం తరతరలా చరితగల్ల తల్లీ నీరాజనం
ప్రతిపల్లెల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం..
జై తెలంగాణ.. జైజై తెలంగాణ..
అన్న తెలంగాణ గేయంతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. శుక్రవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా జరిగాయి. పట్నం, ఊరూ వాడా పండుగ వాతావరణం నెలకొన్నది. మువ్వన్నెల జెండా ఎగిరింది. అమరవీరుల కీర్తిని స్మరించారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. జయజయహే తెలంగాణ అంటూ పాటలు హోరెత్తాయి. వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, మహబూబ్నగర్లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.