తెలంగాణను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది. ఉద్యమనేత స్వరాష్ట్రం కోసం పోరుబాట పడితే కవులు, రచయితలు తమ కలాలతో ఉద్యమానికి ఊతం ఇచ్చారు. వీరందరికీ నేడు సముచిత స్థానం కల్పించారు. ‘అంతటి కళాపిపాసి నేషనల్ పాలిటిక్స్లోకి వస్తే బంగారు భారత్గా మారుస్తారు.. దేశ సంక్షేమం కోసం అడుగుపెడుతున్న కేసీఆర్కు వెన్నంటే ఉంటాం’ అని కవులు, కళాకారులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..పోరు తెలంగాణమా..అంటూ తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు కలాన్ని కత్తిగా మార్చి..పాటలను తూటలుగా పేల్చి ప్రజలను పోరుబాటలో నడిపించారు. సాహితీ సౌరభాలను బాణాల్లా వదిలి పాడిన పాటలు కోట్లాది ప్రజల్ని ఉర్రూతలూగించాయి. ఉద్యమంలో ఆటకు ఎంతో పాటకు అంతే ప్రాధాన్యత. ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రం కోసం పోరుబాట పడితే కవులు, రచయితలు తమ కలాలను ఝుళిపించి ఉద్యమానికి ఊతం ఇచ్చారు.
రాదనుకున్న తెలంగాణను కళ్లమందు సాక్షాత్కరించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తే మరోసారి తమ కలాలకు పదును చెబుతామంటున్నారు. స్వరాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖ కవి..పల్లె జీవన చిత్రాన్ని ఆవిష్కరించిన గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. టీఆర్ఎస్ సభల్లో తన ఆటాపాటలతో ఉర్రూతలూగించే జిల్లాకు చెందిన మరో గాయకుడు సాయిచంద్కు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కిన్నెర గానంతో గ్రామీణ కళను బతికిస్తున్న దర్శనం మొగులయ్యను గుర్తించి పద్మశ్రీ అవార్డు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని కవులు, రచయితలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి నజరానాతో పాటు 300 వందల గజాల ఇంటిస్థలం ఇచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమకు మరింత గౌరవం లభిస్తుందని అంటున్నారు. ఎనిమిదేండ్ల్లలో ఎంతోమంది కవులు, రచయితలకు ఆర్థికసాయం అందించి ఆదుకున్నారని గుర్తుచేస్తున్నారు. కళాకారులకు పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నారని, రచయితలకు కూడా పురస్కారాలు ఇవ్వడం ఆయనకే చెల్లిందంటున్నారు. ఏటా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా, దీపావళి పండుగలకు కవి సమ్మేళనాలు నిర్వహించి రివార్డులు ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ భవిష్యత్తే మారుతుందని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ కలాలకు మళ్లీ పదును పెడ్తామంటున్నారు.
దేశానికి సారధి కావాలి
ఇంట్లో దీపమున్నట్లుగానే ఊరికి దారి ఉండాలి. దేశానికి విజన్ ఉండాలి. విజన్ అందించే నాయకుడు ఉండాలి. తత్వం లేకుండా జీవితం లేదు. విజన్ లేకుండా రాజకీయం లేదు. తత్వం దార్శనికత కలిగిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఇప్పుడు దేశానికి కేసీఆర్ లాంటి ముందు చూపున్న మహానాయకుడే కావాలని, భరతమాత కలగంటున్నది. నేల ఎదురు చూస్తున్నది. ఆత్మగౌరవాన్ని ఆకాశ శిఖరంపై రెపరెపలాడించిన ఉద్యమ యోధుడు, రాజకీయ యుద్ధనౌక. ఆకాశమంత పిడికిలెత్తి బరిగీసి నిలిచి గెలిచిన ధీరుడు. సుధీర్ఘ శాంతియుత సత్యాగ్రహంతో చావును జయించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన దక్కన్ హీరో కేసీఆర్.
– వనపట్ల సుబ్బయ్య, కవి,నాగర్కర్నూల్
రాజకీయ దక్షత కలిగిన నాయకుడు
కేసీఆర్ రాజకీయ దక్షత కలిగిన నాయకుడు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలే కాక దేశ రాజకీయాలపై అవగాహన ఉన్నది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగు భాషనే కాక హిందీ, ఉర్దూ, ఆంగ్లంలోనూ ఆయనకు పట్టు ఉన్నది. ఏ విషయాన్నైన అందరికీ అర్థవంతంగా వివరించే నైపుణ్యం ఉంది. మన తెలుగువాడు దేశ రాజకీయాల్లోకి రావడం హర్షించదగినది, ఆహ్వానించదగినది.
– బైరోజు చంద్రశేఖర్ కవి, వ్యాఖ్య, వనపర్తి
దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం
సమైక్య స్ఫూర్తిని చాటి రాజ్యాంగబద్ద ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ లాంటి నాయకత్వం దేశానికి అవసరం. ఆయనలాంటి నేత దేశ రాజకీయాల్లోకి అడుగువేయడం మంచిది. ప్రస్తుత దేశ రాజకీయ వ్యవస్థలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీలతో ప్రభుత్వాల ఏర్పాటు సమాజానికి ఎంతైనా అవసరం. మత ప్రభుత్వాలు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అసవరం ఆసన్నమైనది.
– సత్తార్ కవి గాయకుడు, వనపర్తి
తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్
కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించి మా కళ్ల ముందు పెట్టారు. రాష్ర్టాన్ని సాధించడం అంటే గొప్ప విషయం కాదు. దేశం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తే తప్పా స్వాతంత్య్రం దక్కలేదు. అలాంటిది ఒక వ్యక్తిలాగా వచ్చి శక్తిలాగా మారి తెలంగాణ సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉన్న తెలంగాణ ఎలా అయిందో కళ్లముందు కనిపిస్తుంది. అలాంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తే దేశ భవిష్యత్ మారిపోతుంది.
– భీంపల్లి శ్రీకాంత్, కవి, పాలమూరు
దేశంలో నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు
దేశానికి రైతు వెన్నముక అన్న సత్యాన్ని గుర్తించి తెలంగాణలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కేసీఆర్. దేశానికి నాయకత్వం వహించే నాయకులెవరూ ఈదిశగా గుర్తించలేదు. నల్లధనాన్ని తీసుకువస్తామని అధికారంలో వచ్చిన పాలకులు ఏం చేశారో అందరికీ తెలుసు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తే సమూలంగా మార్పులు వస్తాయి. పచ్చని తెలంగాణగా ఎలామారిందో సుభిక్ష భారతం అవుతుంది.
– యాదయ్య, రచయిత, మహబూబ్నగర్
జాతీయ రాజకీయాల్లో వస్తే మహర్దశ
దేశం కోసం మహాత్మాగాంధీ ఎలా అహింస పద్ధ్దతిలో స్వాతంత్య్ర ఉద్యమం చేశారో..తెలంగాణ కోసం అదే తరహాలో ఉద్యమం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశారు. దేశానికి నాయకత్వం వహిస్తున్న వాళ్లు తమ సొంత రాష్ర్టాలకే ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఎలా అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.
– వనజ, మహిళా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, మహబూబ్నగర్