వనపర్తి, ఆగస్టు 30 : ఆయిల్పాం సాగుకు తెలంగాణ సర్కారు భరోసా కల్పిస్తున్నది. సంప్రదాయ పంటలు కాకుండా లాభాలు వచ్చే పంటలను వేస్తే రైతులు లాభం పొందడమే కాకుండా భూమి సారవంతం సైతం అయ్యేందుకు వీలుంటుంది. ఇటీవల కొత్తకోట మండలం సంకిరెడ్డి గ్రామ శివారులో 40ఎకరాల్లో ఆయిల్పాం పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆయిల్పాం మొక్కలను రెండు విధాలుగా నాటవచ్చు. చతురస్ర విధానంలో అయితే ఎకరానికి 50 మొక్కలు, త్రిభుజ ఆకారంలో 57 మొక్కలను నాటవచ్చు. ఒక్కో మొక్కకు రూ.193 చొప్పున ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం, మొక్కలకు పర్యావరణ నష్టం జరిగితే ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశ్యంతో ఒక్కో మొక్కకు రూ.20 చొప్పున డీడీ రూపంలో ప్రభుత్వం తీసుకున్న డబ్బులను రైతులకు చెల్లించనున్నట్లు అధికారులు వివరించారు.
ఆయిల్పాం తోటల వల్ల వచ్చే దిగుబడితోపాటు అంతర్ పంటల దిగుబడి రావడం వల్ల రైతులకు మరింత ఆదాయం వస్తుంది. ఆయిల్పాం తోటల పెంపకం వల్ల దిగుబడి మూడేండ్ల తర్వాత గెలలు కావడం మొదలువుతుంది. ఈ సమయంలో రైతులకు 4 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఏడేండ్ల తర్వాత ఎకరాకు 10 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది. తోటల పెంపకం చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీ, ఐదెకరాల్లోపు ఉన్న ఓబీసీ రైతులకు 80శాతం, ఆపైన గల రైతులకు 70శాతం సబ్సిడీని అందజేస్తున్నారు.
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 2019-20 సంవత్సరంలో 252 ఎకరాలు, 2021-22 సంవత్సరంలో 3వేల ఎకరాల్లో, ఈ ఏడాది (2022-23) 5,600 ఎకరాలకు టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటివరకు 676 మంది రైతులు 2,181 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 570 మంది రైతులు 1,784 ఎకరాల్లో అడ్మిషన్ సాంక్షన్ ఇవ్వడం జరిగింది.
జిల్లావ్యాప్తంగా 14 మండలాల నుంచి 250 మంది రైతులను గతంలో విడుతల వారీగా భద్రాది కొత్తగూడెం అశ్వరావుపేటలో ఏర్పాటు చేసిన ఆయిల్పాం సాగు వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ప్రస్తుతం పాన్గల్, శ్రీరంగాపురం, పెబ్బేర్, ఆత్మకూర్ మండలాల్లో ఆయిల్పాం సాగు కావడం, గెలలు కూడా వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని రైతులను ఈ మండలాలకు తీసుకెళ్లి చూయిస్తున్నారు. వనపర్తి మండలం కడుకుంట్లలో ఆయిల్పాం నర్సరీని ఏర్పాటు చేయడం వల్ల జిల్లా రైతులే కాకుండా ఇతర జిల్లాల రైతులు కూడా ఆయిల్పాం మొక్కలను తీసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నడం విశేషం.
వనపర్తి జిల్లాలో ఆయిల్పాం సాగుపై రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు. గతంలో ఇతర ప్రాంతాల రైతులను తీసుకుని వెళ్లి సాగుపై అవగాహన కల్పించేవాళ్లం. ప్రస్తుతం జిల్లాలో సాగు చేసిన ఆయిల్పాం గెలలు రావడంతో ఇక్కడి రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేశాం. ఈ ఏడాది సైతం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను 100శాతం పూర్తి చేస్తాం.
– సురేశ్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి, వనపర్తి