పెబ్బేరు, మార్చి 3 : దేశంలోని ఇతర రాష్ర్టాలకు అభివృద్ధి పథకాల అధ్యయన వేదికగా తెలంగాణ మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో బీఆర్ఎస్ మండల సీనియర్ నేత కట్టా శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు, కొత్తసూగూరు గ్రామాలకు చెందిన వంద మంది సగర సంఘం సభ్యులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో దేశానికి దిక్సూచిలా మన పథకాలతోపాటు అభివృద్ధి నిలిచిందన్నారు. తెలంగాణ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలవడంతోపాటు ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అందుకే ఆయా రాష్ర్టాల సీఎంలు ఈ పథకాలను అ మలుచేసే పనిలో ఉన్నారన్నారు. వర్తమానం, భవిష్యత్ అంతా బీఆర్ఎస్సేనని అన్నారు. సీఎం కేసీఆర్ వెంట మన రాష్ట్రం నడిచినట్లు, రాబోయే రోజుల్లో దేశావ్యాప్తంగా ప్రజలు అనుకరించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జూదం వెంకటేశ్, నాయకులు పరశురాం, వెంకటేశ్వర్లు, శేఖర్, అశోక్, రవీందర్ పాల్గొన్నారు.