మహబూబ్నగర్, డిసెంబర్ 29 : కంటివెలుగు కార్యక్రమానికి అధికారులు సంసిద్ధం కావాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్స్లో కంటివెలుగు, కొవిడ్ బూస్టర్ డోస్, గ్రామీణ క్రీడాప్రాంగాణాలు, ధరణి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంపై త్వరలోనే మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. 100రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 45 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బృం దంలో ఒక వైద్యాధికారితోపాటు, సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశలు, పారామెడికల్ ఆప్తాలమిస్ట్ ఉంటారని పేర్కొన్నారు. 18ఏండ్లు నిండిన వారందరికీ పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల కొవిడ్ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రావు కోరారు. కొవిడ్పై భయపడాల్సిన అవసరంలేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనే విషయంపై అవగాహన కల్పించాలని చెప్పారు. అర్హులైన వారిని గుర్తించి తక్షణమే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని, అవసరమైన వ్యాక్సిన్ను తక్షణం తెప్పించాలని తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్పై వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగాణాలకు స్థలాలు గుర్తించి నివేదికలను సమర్పించాలని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో 3, 4 రోజుల్లో బ్యాగుఫిల్లింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 7 నాటికి అన్ని బ్యాగుల్లో విత్తనాలు నాట డం పూర్తి కావాలన్నారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని తాసిల్దార్లకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఎంహెచ్వో కృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు.
బయోమెట్రిక్ అమలు చేయాలి
సమీకృత కలెక్టరేట్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సమీకృత కలెక్టరేట్లోని పలు కార్యాలయాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, సామగ్రిని పద్ధతి ప్రకారం అమర్చుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ అమలుకు ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఎన్ఐసీ అధికారిని ఆదేశించారు.