మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. మొత్తం 7,963 మంది టీచర్లు ఓటింగ్లో పాల్గొననున్నారు. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బరిలో 21 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే ప్రచారం పూర్తి కాగా ఓటింగ్కు అధికారులు, సిబ్బందిని నియమించారు. ఈ ఎన్నిక రాజకీయ వర్గాలతో పాటుగా మేధావిలోకంలోనూ ఆసక్తికరంగా మారింది.
నాగర్కర్నూల్, మార్చి 12(నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయుల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వ్యవసాయ, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల లెక్చరర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం ఈ నెలలో ముగియనున్నది. దీంతో ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కాగా, 21మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఆయా అభ్యర్థులకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
తమ అభ్యర్థులు గెలిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వివరిస్తూ ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేలా ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్టకేలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అందుకుగానూ ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి పాలమూరులో ఎన్నికల కోసం 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ఉంటుంది.
పోలింగ్కు అవసరమైన సామగ్రిని, బ్యాలెట్ బాక్సులను ఆదివారం కలెక్టర్ల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. దీనికోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిశాక ఈ బాక్సులను హైదరాబాద్కు తరలించేలా సూచనలు ఇచ్చారు. ఓటర్లు ఇతర ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ కేంద్రంలోనే ఇచ్చే పెన్నుతో అంకెల రూపంలో ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. దీనిపై అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. ఇక పోలింగ్కు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు, వెబ్క్యాస్టర్లు, సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, సిబ్బందిని నియమించారు. ఒక పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలను మూసివేయించారు.
పోలింగ్కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉండనున్నది. డీఎస్పీల పర్యవేక్షణలో రూట్లను ఏర్పాటు చేయగా, సీఐల ఆధ్వర్యంలో స్పెషల్ఫోర్స్, ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు, మొబైల్ పెట్రోలింగ్ ఉంటుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సై, ఏఎస్సై, హెడ్కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. మొత్తం మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తికావడంతో ఉపాధ్యాయులతో పాటుగా రాజకీయ, మేధావి వర్గాల్లో ఎన్నికలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఇతర జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 27పోలింగ్ కేంద్రాల్లో 9,090 మంది, వికారాబాద్లో 1,969 మంది, మేడ్చల్-మల్కాజిగిరిలో 6,759, హైదరాబాద్లో 3,837మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 7963మంది ఉన్నారు. అందులో మహబూబ్నగర్ జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలకు గానూ 3,461ఓటర్లు ఉన్నారు. నాగర్కర్నూల్లో 14కేంద్రాలకుగానూ 1,822మంది ఓటర్లు, వనపర్తి జిల్లాలో ఏడు కేంద్రాలకు గానూ 1,139మంది ఓటర్లు, జోగుళాంబగద్వాల జిల్లాలో 11కేంద్రాలకు గానూ 877మంది ఓటర్లు, నారాయణపేట జిల్లాలో ఐదు కేంద్రాలో 664మంది ఉపాధ్యాయ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేశాం. సోమవారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జిల్లాలో 1,822మంది ఓటర్లకు గానూ 14పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రిసైడింగ్ అధికారులు, వెబ్ క్యాస్టర్లు, సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు మొత్తం 120మంది సిబ్బందిని నియమించాము.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్జిల్లా
అధికారులకు సూచనలు ఇచ్చాం
పాలమూరులోని బాలుర కళాశాల మైదానంలో ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రితో అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ నిర్వహణకు ఫ్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, పోలీసులకు సలహాలు, సూచనలు ఇచ్చాము. ఎన్నికల నిర్వహణపై శిక్షణతోపాటు హ్యాండ్ బుక్ ఇచ్చాము. ఎన్నికల సామగ్రి భద్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. జిల్లాలో 15పోలింగ్ కేంద్రాలకు గానూ 3,461 మంది ఓటర్లు ఉన్నారు.
– రవినాయక్, కలెక్టర్, మహబూబ్నగర్ జిల్లా