రాజోళి, మే 21 : రాజోళి మండలంలోని సుంకేశుల డ్యాంకు ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం వరదతాకిడి ప్రారంభమైంది. డ్యాం జేఈ శ్రీనివాస్రెడ్డి అందించిన సమాచారం ప్రకారం ఎగువ నుంచి 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు తెలిసింది. దీంతో డ్యాం 5గేట్లు 1మీటరు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పా రు. అయితే వరద సమాచారం తెలియని రాజోళికి చెందిన పెద్ద ఎర్రన్న, సుధాకర్ అనే రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం తుంగభద్రానది అవతలికి ఎడ్లబండ్లతో వెళ్లారు. అకస్మత్తుగా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఎటూ తోచని రైతులు నది మధ్యలో ఎడ్లబండ్లతో ఉండిపోయారు.
చుట్టుపక్కల ఉన్న రైతులు నీటి మధ్యలో ఉన్న వారిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో రాజోళి ఉపసర్పంచ్ గోపాల్ వెంటనే డ్యాం జేఈ శ్రీనివాస్రెడ్డికి ఫోన్లో సమాచారం అందించగా ఎత్తిన 5 గేట్లలో ఒక గేటును తగ్గించడంతో మత్స్యకారుల సహకారంతో రైతులను, ఎడ్లను పుట్టిలో రాజోళి ఒడ్డుకు చేర్చారు. అయితే డ్యాం అధికారులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా గేట్లుఎత్తడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇక నుంచైనా డ్యాం అధికారులు చుట్టపక్కల గ్రామాల వారికి సమాచారం ఇచ్చి గేట్లు తెరువాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.