ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి కార్తెకు ముందే రోళ్ల్లు పగిలేలా ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. వారం రోజులుగా భానుడి ఉగ్రరూపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితేనే ఇండ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వారం రోజుల్లో రెండుసార్లు కురిసిన తేలికపాటి వర్షానికి వాతావరణం కాస్త చల్లబడినా మరుసటి రోజల్లో మరింత ఉష్ణోగ్రత పెరగుతూ వచ్చింది.వనపర్తి జిల్లా కానాయపల్లి, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.
మహబూబ్నగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్నగర్ మెట్టుగడ్డ : ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. వారం రోజులుగా భా నుడి ప్రభావం పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. రాత్రి ఏడు గంటల వరకు వేడి తగ్గకపోవడం తో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలకుతోడు వడగాల్పులు కూడా పెరిగాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులు జనం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. వనపర్తి జిల్లా కానాయపల్లిలో గురువారం 43.8 ఉష్ణోగ్రత నమోదు కాగా.. గతేడాది ఇదే సమయంలో అ క్కడ 40.5 డిగ్రీలు నమోదైంది. అంటే 3.3 డిగ్రీల ఉష్ణతా పం పెరిగింది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. గతేడాది ఈ సయంలో జిల్లాలో 39.8 డిగ్రీలే అత్యధికం. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో 43.4 డిగ్రీలు, నాగర్కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 43 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మాగనూరులో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరాసరి 40 నుంచి 43 డిగ్రీలు నమోదవుతున్నా యి. ఎండల ప్రభావంతో ఉపాధి కూలీలు ఉదయం త్వరగా పనులకు వెళ్లి త్వరగా ఇంటికి వచ్చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో ఎండ వేడిని భరించలేక మధ్యా హ్నం విశ్రాంతి తీసుకుంటున్నారు. కూలీలు, చిరువ్యాపారు లు ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదు కానున్న ట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పది రోజుల్లో కనీసం ఐదు రో జులపాటు తేలికపాటి వర్షాలు కురిశాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత అధికం గా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎండ ప్రభావం తప్పించుకునేందుకు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళ ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. అత్యవసరమైతే తప్పా ఇండ్ల నుంచి బయటికి రావొద్దు. ఎండలు స్థాయిని మించి నమోదతున్నప్పుడు మరణాలు సంభవించొచ్చు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ తగిలితే
వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
– డాక్టర్ రమేశ్, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్, మహబూబ్నగర్
వేసవిలో అతి శీతలపానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినా.. అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉన్నది. గది ఉష్ణోగ్రతతో సమాన వేడి ఉన్న పానీయాలను మాత్రమే తీసుకోవాలి. ఎండలో తిరిగొచ్చి అతిశీతల పానీయాలు తీసుకుంటే శరీరంలో అప్పటి వరకు వేడిగా ఉన్న కణాలు ఒక్కసారిగా చల్లబడతాయి. ఇది అనారోగ్యానికి దారితీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. నాలుగు ఎండు కర్జూరాలను గంటపాటు నీటిలో నానబెట్టి తాగితే చలువచేస్తుంది. ఐదు ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తాగితే ఉపయుక్తంగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గొడుగు వాడడం మంచిది.