భానుడు భగభగమంటున్నాడు. నడి వేసవి రాకముందే ఉమ్మడి జిల్లాలో ఉష్ణతాపం మొదలైంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మార్చిలోనే 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇండ్లల్లో ఉక్కబోతతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. సూరీడు సుర్రుమంటుండడంతో ఇండ్ల నుంచి రావాలంటే జంకుతున్నారు. ఇక మేలో ఎండలు దంచికొడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. గురువారం నర్వలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అత్యవసరమైతే ముఖానికి స్కార్ఫ్లు, కర్చీఫ్లు, టవాళ్లు కట్టుకొని బయటకు వస్తున్నారు. జ్యూస్లు, శీతల పానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
మహబూబ్నగర్, మార్చి 17 : జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 41.7, వనపర్తి జిల్లా కేతెపల్లిలో 41.2, జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో 41.7, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశే షం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత ఉన్నది. ఉమ్మడి జిల్లాలో మార్చి మూడో వారంలో సాధారణ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు ఉండాలి. కానీ గురువారం 40 డిగ్రీలకు పైగానే నమోదైంది. గతేడాది మార్చి 17న బిజినేపల్లిలో 38.2 డిగ్రీలు ఉం డగా.. ఈ ఏడాది అక్కడ 40.4 డిగ్రీలకు చేరుకున్నది. ఇక వనపర్తి జిల్లా కానాయపల్లిలో గతేడాది సరిగ్గా ఇదే రోజున 38.9 డిగ్రీలుండగా.. ఈ ఏడాది 40.3 డిగ్రీలు ఉన్నది. సూర్యుడి ప్ర తాపం నుంచి తప్పించుకునేందుకు జనం గొడుగులు, టోపీలు ధరిస్తున్నారు. చాలా మంది కాటన్ దు స్తులు ధరిస్తూ వేడి బాధ నుంచి విముక్తి పొందుతున్నారు. అయితే, ఉత్తర తెలంగాణతో పోలిస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం ఊరటనిస్తున్నది. రానున్న మూడు రోజు ల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎండ ప్రభావం అధికంగా ఉండే తరుణంలో మధ్యా హ్నం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడిమి మొదలవుతున్నది. సాయంత్రం 6 గంటలైనా వేడి తగ్గడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటో ఊహించుకోవడమే కష్టంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
సుర్రుమంటున్నది..!
గద్వాల, మార్చి 17 : జోగుళాంబ గద్వాల జిల్లాలో వారం రోజులుగా ఎండలు సుర్రుమంటున్నాయి. గత శనివారం వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలైంది. మధ్యాహ్న సమయంలో రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉక్కపోత పెరగడంతో ప్రజలు కూలర్లు, ఏసీల కొనుగోళ్లు చేపడుతున్నారు. గత సోమవారం నుంచి జిల్లాలో సగటున 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత శుక్రవారం గరిష్ఠంగా 36 డిగ్రీలు ఉండగా.. ఈ గురువారం 40 డిగ్రీలకు చేరుకున్నది. మధ్యాహ్నం ఎండ
వేడి ఎక్కువగా ఉండగా..
తెల్లవారుజామున చల్లటి గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ప్రజలు ఉదయం 11 గంటల లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. గ్రామాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి ఇండ్లకు వస్తున్నారు.
ముందు జాగ్రత్త తప్పనిసరి..
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఎక్కువగా జ్వరం, వాంతులు, విరేచనాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎండ వేడి కారణంగా గాలిలో నీరు ఆవిరై తేమశాతం పడిపోతుంది. గాలిలో నీరు ఎక్కువగా లేకపోవడంతో మనుషులు, జీవాలపై ఈ ప్రభావం పడుతుంది. దీంతో వెంటనే అలసటకు గురి కావడంతోపాటు జ్వరాలు వస్తాయి. ఇప్పటినుంచే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరిబొండాలు తీసుకోవడంతో ఉపశమనం కలుగుతుంది.
– డాక్టర్ విజయ్భాస్కర్రెడ్డి, గద్వాల