పాలమూరు, డిసెంబర్ 1 : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు.
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ముం దుకెళ్లాలన్నారు. సైన్స్పై ఆసక్తి పెంచుకొని జీవితంలో చోటుచేసుకునే చిన్నచిన్న సమస్యలకు పరిష్కారమార్గం కనుక్కోవాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి 130 ప్రాజెక్టులు రాగా, రిషి సాత్విక్ శ్లోకాస్కూల్ జడ్చర్ల, ఎం.వరలక్ష్మి జెడ్పీహెచ్ఎస్ శాఖాపూర్ (అడ్డాకుల), అనూష జెడ్పీహెచ్ఎస్ తాటికొండ (మహబూబ్నగర్), వి.సాయిరాం జెడ్పీహెచ్ఎస్ బాలుర మహ్మదాబాద్, అఖిల అగస్యస్కూల్ (రాజాపూర్) ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు ప్రశంసాప్రతాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, ఎంవీస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిప్రసాద్, వేణు, ఉపాధ్యాయులు శరత్, గోపీనాథ్, మంజులత తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలి
ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని డీఈవో రవీందర్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణాకార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రతి ప్రాథమిక పాఠశాలను నెలలో రెండుమార్లు మానిటరింగ్ చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను విధిగా నిర్వహించాలని ఆదేశించారు. కాంప్లెక్స్ స మావేశాలకు సెలవులు అంగీకరించబడవని, ఒకవేళ ప్రత్యేక పరిస్థితులు ఉంటే ఉన్నతాధికారులతో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. సబ్జెక్టుకు పెడగాజీ విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత డీఆర్పీలు లేదా ఆర్పీలతో నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అకాడమిక్ జిల్లా మానిటరింగ్ అధికారి వెంకట్రాంరెడ్డి, ఎస్సీఈఆర్టీ అబ్జర్వర్ జగదీశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు.